వర్మీ కంపోస్టు తయారీలో రాష్ట్రం దేశానికే ఆదర్శం
ABN , First Publish Date - 2020-11-21T05:55:17+05:30 IST
వర్మీ కంపోస్టు తయారీలో రాష్ట్రం దేశానికే ఆదర్శం

రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రవీందర్
వెల్దుర్తి నవంబర్ 20: పంచాయతీ సిబ్బంది సేకరించిన తడి పొడి చెత్తతో తయారు చేస్తున్న వర్మీ కంపోస్టు విధానం దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ రవీందర్ తెలిపారు. శుక్రవారం మండలంలోని హస్తల్పూర్లో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డు వద్ద తయారు చేస్తున్న వర్మీ కంపోస్టు విధానాన్ని పరిశీలించారు. వర్మీ కంపోస్టు ఎరువుల వల్ల పంచాయతీలకు ఆదాయం పెరుగుతుందని, అలాగే గ్రామాల్లో పెంచుతున్న మొక్కలకు కంపోస్టు ఎరువులు వాడితే ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. గ్రామంలో నర్సరీని పరిశీలించి రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. మొక్కల పెంపకాలకు అవసరమయ్యే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం రైతు వేదిక భవనం నిర్మాణం పనులను పరిశీలించారు. రైతు వేదిక భవన నిర్మాణాలకు బిల్లులు ఇప్పించాలని జడ్పీటీసీ రమే్షగౌడ్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఆయన విడతల వారీగా బిల్లులు చెల్లిస్తామని చెప్పారు. సమస్యలు తలెత్తకుండా చూడాలని పంచాయతీరాజ్ నర్సాపూర్ డీఈ రాధికను ఆదేశించారు. ఆయన వెంట డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్, జడ్పీటీసీ రమేష్ గౌడ్, ఎంపీడీవో జగదీశ్వరాచారి, ఎంపీవో తిరుపతిరెడ్డి, హస్తల్పూర్ సర్పంచ్ మమత పాండురంగాచారి, ఏపీవోరాజు, గ్రామస్థులు పాల్గొన్నారు.
పల్లెప్రగతి పకడ్భందీగా జరగాలి
తూప్రాన్రూరల్ : గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమాలను పకడ్భందీగా నిర్వహించాలని, దీనికి పంచాయతీ కార్యదర్శులు పూర్తి బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ పేర్కొన్నారు. శుక్రవారం తూప్రాన్ మండలం నాగులపల్లి గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పల్లెప్రగతిలో చేపట్టిన పనులను స్థానిక అధికారులతో సమీక్షించారు. గ్రామాభివృద్ధిపై గ్రామస్థులతో ఆరా తీశారు. పంచాయతీ కార్యదర్శి వద్ద ఉండే పల్లెప్రగతి యాప్లో నమోదవుతున్న వివరాలను డిప్యూటీ కమిషనర్ పరిశీలించి తగిన సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీలలో పల్లెప్రగతి యాప్ సత్ఫలితాలనిస్తున్నట్లు చెప్పారు. ఆయనతో పాటు ఎంపీవో రమేశ్, పంచాయతీ కార్యదర్శి ఉన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన
హవేళీఘణపూర్ : మండల పరిధిలోని లింగ్సాన్పల్లి, ఔరంగాబాద్ తం డా గ్రామాల్లో నిర్వహించిన అభివృద్ధి పనులను రాష్ట్ర క్వాలిటీ కంట్రోల్ అధికారి రమాకాంత్ శుక్రవారం పరిశీలించారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న పారిశుధ్యం, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహార వస్తువులను, ప్రభుత్వ నిధులతో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్డు, ఎవెన్యూ ప్లాంటేషన్, రేషన్షాపు, స్కూల్ బిల్డింగ్లను, ప్రకృతి వనాలను పరిశీలించి పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న పనులు నాణ్యతగా ఉండాలని, రేషన్ షాపు సేవలను అర్హులైన వారందరూ ఖచ్చితంగా వినియోగించుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎన్ఆర్ఈజీఎ్స ఈసీ లక్ష్మణ్, సర్పంచ్లు చౌదరి మహిపాల్రెడ్డి ఉన్నారు.