వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలి
ABN , First Publish Date - 2020-12-06T04:08:33+05:30 IST
కార్పొరేట్ వారి ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్రం రూపొందించిన నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడ రేషన్ (యూటీఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు.

గద్వాల టౌన్, డిసెంబరు 5: కార్పొరేట్ వారి ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్రం రూపొందించిన నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడ రేషన్ (యూటీఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శనివారం పట్టణంలోని పాత బస్టాండ్ చౌరస్తాలో నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోపాల్, రామనగౌడ్, సీనియర్ నాయకులు రాఘవులు, రవి, శ్రీధర్, చిరంజీవి, బిచపల్లి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలందరూ అండగా నిలవాలి
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పలు రైతు సంఘాలు ఢిల్లీలో చేస్తున్న ఆందోళనకు ప్రజలందరూ అండగా నిలవాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు. నిరసనలో భాగంగా ఈ నెల 8న రైతులు ఇచ్చిన భారత్ బంద్కు ప్రజలు, ప్రజాసంఘాలు, స్వచ్చంద సంస్థలు, విద్యావంతులు మేధావులు, కార్మికులు, కర్షకులు అండగా నిలవాలని అభ్యర్థించారు. శనివారం పట్టణంలోని రామరెడ్డి, స్మారక గ్రంధాలయంలో తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర కోశాధికారి ప్రభాకర్, పౌరహక్కుల సంఘం జిల్లాధ్యక్షుడు సుభాన్, తెలంగాణ రైతాంగ సమితి జిల్లా కార్యదర్శి కృష్ణయ్య, కృపదానం, నాగరాజు తదితరులు విలేఖరులతో మాట్లాడారు. రైతులు ఇచ్చిన భారత్ బంద్ను విజయవంతం చేసేందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు.