రైతులకు స్వేచ్ఛ ఇచ్చి ప్రోత్సహించాలి
ABN , First Publish Date - 2020-12-29T03:14:45+05:30 IST
వ్యవసాయంపై రైతులకు స్వేచ్ఛ ఇచ్చి సాగు చేసేలా ప్రోత్సహించాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు.
వనపర్తి టౌన్, డిసెంబర్ 28: వ్యవసాయంపై రైతులకు స్వేచ్ఛ ఇచ్చి సాగు చేసేలా ప్రోత్సహించాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంతృత సాగుతో రైతులను నియంత్రించే ప్రయత్నం చేశారన్నారు. తాను చెప్పిన పంటలనే సాగు చేయాలని, లేదంటే రైతు బంధు రాదని శాసించడంతో రైతులు చాలా నష్టపోయారన్నారు. తాను చేసిన తప్పును తెలుసుకున్న కేసీఆర్ ఇక నుంచి నియంతృత సాగు ఉండదని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఇప్పటివరకు కొత్త చట్టాలకు వ్యతిరేకమన్న సీఎం ఇప్పుడు యూటర్న్ తీసుకోవడంలో సిగ్గుందా అన్ని విమర్శించారు.