పోలీసు శాఖ గౌరవం పెంచాలి
ABN , First Publish Date - 2020-12-18T04:48:30+05:30 IST
పోలీసు శాఖకు గౌరవం పెరిగేలా విధులు నిర్వహించాలని ఎస్పీ అపూర్వరావు మహిళా పోలీస్ సిబ్బందికి పిలుపు నిచ్చారు.
- మహిళా పోలీసులతో ఎస్పీ అపూర్వారావు
వనపర్తి క్రైమ్, డిసెంబరు 17 : పోలీసు శాఖకు గౌరవం పెరిగేలా విధులు నిర్వహించాలని ఎస్పీ అపూర్వారావు మహిళా పోలీస్ సిబ్బందికి పిలుపు నిచ్చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మహిళ పోలీస్ సిబ్బందితో గురువారం నిర్వహించిన ఇంట్రాక్టివ్ సెషన్లో ఆమె మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో ఉమెన్ సేఫ్టీ అధికారులు మహిళ పోలీసు అధికారుల సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తారని చెప్పారు. మహిళ సిబ్బంది కమిటీ ఇన్చార్జీ, నోడల్ అధికారిగా హెడ్కానిస్టేబుల్ విజయలక్ష్మీని నియమించినట్లు తెలిపారు. జిల్లా మహిళా పోలీసు వాట్సప్ గ్రూప్ను ఏర్పాటు చేసుకోవాలని, ఏమైనా సమస్యలుంటే ఆ గ్రూపులో తెలపాలని సూచించారు. మహిళ అధికారులు, సిబ్బంది కోసం ప్రతీ పోలీస్ స్టేషన్లో వాష్రూమ్, విశ్రాంతి గదిని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నూతనంగా వచ్చిన మహిళా కాని స్టేబుళ్లకు నిర్వహించవలసిన విధులు, ప్రజలతో వ్యవహరించే తీరుపై ఇప్పటికే అవగాహన కల్పించినట్లు తెలిపారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. వృత్తిలో నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ షాకీర్హుస్సేన్, డీఎస్పీ కిరణ్కుమార్, డీసీఆర్బీసీఐ జమ్ములప్ప, సీఐలు సూర్యనాయక్, సీతయ్య, డీసీఆర్బీ ఎస్ఐ రాజు, ఎస్పీ పీఆర్వో రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల మన్ననలు పొందాలి
వీపనగండ్ల : మానవతా దృక్పథంతో విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని ఎస్పీ అపూర్వారావు అన్నారు. వీపనగండ్ల పోలీస్ స్టేషన్ను గురువారం ఆమె తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నేరాలను నియంత్రించాలని ఎస్ఐ వహీద్అలీబేగ్కు తెలిపారు. ఆమె వెంట డీఎస్పీ కిరణ్కుమార్ తదితరులు ఉన్నారు.
