నిర్మాణంలో ఉన్న ఇంటిపై నుంచి పడి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-12-12T04:29:18+05:30 IST
నిర్మాణంలో ఉన్న ఇంటిపై పనులు చేస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్తీగలు తగిలి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలోని రాజీవ్నగర్ కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది.
జడ్చర్ల, డిసెంబరు 11 : నిర్మాణంలో ఉన్న ఇంటిపై పనులు చేస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్తీగలు తగిలి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలోని రాజీవ్నగర్ కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. బూర్గుపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టాడు. మిడ్జిల్ మండలం కంచన్పల్లికి చెందిన తాపీమేస్త్రీ పొంగల్ పర్వతాలు(26) ఇంటి నిర్మాణంలో వినియోగించిన సెంట్రింగ్ డబ్బాలను తొలిగిస్తుండగా ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన జరిగినప్పుడు ఇంటి యజమాని అక్కడి నుంచి పరారయ్యాడని, సంఘటన వివరాలను స్థానికులు జడ్చర్ల పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ శంషొద్దీన్ ఘటనాస్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పర్వతాలుకు తల్లిదండ్రులతో పాటు ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉన్నట్లు తెలిసింది.
రెండు వాహనాలు ఢీ : క్లీనర్, డ్రైవర్లకు గాయాలు
మక్తల్రూరల్ : మండలంలోని గుడిగండ్ల గుట్ట వద్ద జాతీయ రహదా రిపై ట్రాక్టర్, అశోక్ లేలాండ్ వాహనాలు ఢీకొన్న సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి మాన్వికి ఇనుము లోడ్తో వెళ్తు న్న అశోక్లేలాండ్ వాహనం జక్లేర్ సమీపంలో గుట్ట వద్ద ముందు భాగం లో వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. ట్రాక్టర్ను దాటి ముందుకు వెళ్లేందుకు రోడ్డు సరిగా లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు.
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
దేవరకద్ర : చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని వెంకటాయపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుం ది. స్థానిక ఎస్ఐ భగవంత్రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రా మానికి చెందిన వ్యక్తి జెల్ల పెద్ద వెంకటయ్య (45) శుక్రవారం ఉద యం గ్రామ సమీపంలోని చెరువులో చేపలు పట్టేందు కు వెళ్లాడు. నీటిలోకి దిగి చేపలు పడుతుండగావల ఆయనకు చుట్టుకోవడంతో ఊపిరి ఆడక మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు, పోస్టు మార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
చేపల మృతితో మత్స్యకారుల ఆందోళన
మిడ్జిల్ : చెరువులో పెంచుతున్న చేపలు అనుమానాస్పందంగా మృతి చెందుతున్నాయి. దీంతో మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం భైరంపల్లి గ్రామంలోని లోతుకుంట చెరువులో ప్రస్తుత సంవత్సరం 50వేలు, 2019 సంవత్సరంలో చెరువులో 20 వేల చేపలను వదిలారు. గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు శుక్రవారం చెరువు వద్ద వెళ్లగా చెరువులో గత సంవత్సరం వదిలిన చేపలు మృత్యువాతకు గురై నీటిపై తేలుతూ కనిపించినట్లు తెలిపారు. మృతి చెందిన చేపల విలువ 50వేలకు పైగా ఉంటుం దని సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు కొత్తపల్లి గ్రామ ఊరచెరువులో ప్రస్తుత సంవత్సరం లక్షా యాభైవేల చేప పిల్లలను వదలగా ప్రస్తుతం వెయ్యికి పైగా చేపలు మృతి చెందినట్లు మత్స్యకార సంఘం నాయకులు శ్రీను, పాండు, గొడుగు జంగయ్య, బి. రాములు, గోపాల్, మల్లయ్య, వెంకటయ్య తెలిపారు. రెండు గ్రామాలకు చెందిన చెరువుల్లో చేపలు మృతి చెందడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు చేపట్టి మృత్యువాతకు గురైన చేపలపై విచారణ చేపట్టి, చేపలు మృత్యువాత పడకుండా చర్యలు చేపట్టాలని పలువురు మత్స్యకారసంఘం నాయకులు కోరుతున్నారు.