న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు
ABN , First Publish Date - 2020-12-31T03:16:19+05:30 IST
న్యూ ఇయర్ అంటేనే జోష్. ఎక్కడ లేని హుషారుతో అన్ని వర్గాల ప్రజలు ఎంజాయ్ చేస్తుంటారు.
మహబూబ్నగర్, డిసెంబరు 30: న్యూ ఇయర్ అంటేనే జోష్. ఎక్కడ లేని హుషారుతో అన్ని వర్గాల ప్రజలు ఎంజాయ్ చేస్తుంటారు. మందేసి, చిందేసి ఉత్సాహంగా వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో గొడవలు, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. అసలే కరోనా నేపథ్యంలో వేడుకలు జరుపుకుంటే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని, జోష్ ఎక్కువైతే శాంతిభద్రతల సమస్యలు వస్తాయని భావించిన పోలీస్శాఖ ఆంక్షలు విధిస్తోంది. సాయంత్రం ఆరు గంటల నుంచి రోడ్లపై డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించారు. కరోనాతో కొంతకాలంగా పక్కన పెట్టిన బ్రీత్ అనలైజర్ మిషన్ల బూజు దులిపి, నోట్లో పైపులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. పట్టణ నలువైపుల, అదేవిధంగా జాతీయ రహదారిపై ఈ తనిఖీలు చేయనున్నారు. తాగి వాహనాలు నడిపితే వాహనాలు సీజ్, కేసులు పెట్టడంతో పాటు జరిమానాలు విధించనున్నారు. ఈవెంట్స్ నిర్వహణపైనా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. రాత్రి సమయంలో పలు వీధుల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించే అవకాశం ఉంది. డీజేలతో డ్యాన్స్లు చేయడం, గుంపులుగా రోడ్లపైకి రావడం వంటి వాటిని నిషేధించనున్నారు. 31న రాత్రి పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను నియమించనున్నారు. మరో వైపు వైన్స్లు, బార్లలో స్టాక్ను నింపేసుకున్నారు. ఒక్క రోజే రూ.కోట్లలో మద్యం విక్రయాలు జరగనుండటంతో బ్రాండ్ల సరుకుతో దుకాణాలు నిండిపోయాయి. బుధవారం సాయంత్రం డిపోల నుంచి రూ.కోట్ల విలువ గల మద్యం లిఫ్ట్ చేశారు.