పదర వైస్‌ ఎంపీపీపై చర్య తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-12-11T03:43:07+05:30 IST

ఓ కుటుంబానికి ఉపాధి కల్పిస్తానని నమ్మించి మోసం చేసిన పదర వైస్‌ ఎంపీపీ వరుణ్‌కుమార్‌పై చర్య తీసుకోవాలని గురువారం మ ద్దిమడుగులో బాధిత కుటుంబం, వారి బంధువులు, గ్రామస్థులు రాస్తారోకో చేప ట్టారు.

పదర వైస్‌ ఎంపీపీపై చర్య తీసుకోవాలి

- మోసపోయిన కుటుంబానికి న్యాయం చేయాలి  

- బంధువులు, గ్రామస్థుల ఆందోళన

పదర, డిసెంబరు 10: ఓ కుటుంబానికి ఉపాధి కల్పిస్తానని నమ్మించి మోసం చేసిన పదర వైస్‌ ఎంపీపీ వరుణ్‌కుమార్‌పై చర్య తీసుకోవాలని గురువారం మద్దిమడుగులో బాధిత కుటుంబం, వారి బంధువులు, గ్రామస్థులు రాస్తారోకో చేపట్టారు. బాధిత కుటుంబ యజమాని, గ్రామస్థుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పదర మండలం  ఓ గ్రామానికి చెందిన దంపతులకు ఉద్యోగం కల్పిస్తానని తీసుకెళ్లిన పదర వైస్‌ ఎంపీపీ వరుణ్‌కుమార్‌ హైదరాబాద్‌లోని తన సొంత కోళ్లఫారంలో పని కల్పించాడు. కుటుంబ యజమానికి క్యాషియర్‌ ఉద్యోగం కల్పించి తన సొంత ఇంట్లోనే నివాసం ఏర్పాటు చేశాడు. భర్త డ్యూటీకి వెళ్లిన తర్వాత భార్యను లోబర్చుకున్నాడు. కొన్ని నెలలు గడిచాక వాళ్లిద్దరు ఇంట్లో ఉండడాన్ని గమనించిన పిల్లలపై చేయిచేసుకున్నాడు. పిల్లలు ఏడుస్తూ తండ్రికి  విషయం చెప్పారు. దీంతో అతను భార్యను మందలించాడు. ఈ సందర్భంలో వరుణ్‌కుమార్‌కు, బాధితుడి మధ్య ఘర్షణ ఏర్పడింది. వరుణ్‌కుమార్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి బాధితుడిని, ఆయన పిల్లలను తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. అక్కడి నుంచి పిల్లలతో బాధితుడు సొంత గ్రామానికి చేరి కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు ఇక్కడ చెల్లదు, హైదరాబాద్‌లోనే ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్పారు.  తమకు న్యాయం చేయడం లేదని బాధితుడు తన బంధువులు, గ్రామస్థులు, పిల్లలతో కలిసి పదర మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తనకు వైస్‌ ఎంపీపీ నుంచి ప్రాణహాని ఉన్నదని, న్యాయం చేయాలని వరుణ్‌కుమార్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. దాదాపు గంటపాటు నిరసన వ్యక్తం చేయడంతో మద్దిమడుగు రహదారి దిగ్బంధమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వైస్‌ ఎంపీపీని, బాధితుడి భార్యను పిలిపిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను ఉపసంహరించుకున్నారు.


Updated Date - 2020-12-11T03:43:07+05:30 IST