ఆ స్థలానికి ఎండోమెంట్‌కు సంబంధం లేదు

ABN , First Publish Date - 2020-02-08T10:40:21+05:30 IST

వనపర్తి జిల్లా కేంద్రంలో బస్టాండ్‌ సమీపంలో సర్వే నెంబర్లు 1119, 1120లో ఉన్న భూమి తమదేనని, ఎండోమెంట్‌కి ఎలాంటి సంబంధం లేదని హైదరాబాద్‌కు

ఆ స్థలానికి ఎండోమెంట్‌కు సంబంధం లేదు

  • భూమి వారసులం మేమే
  • మా వాటా స్థలాన్ని మాత్రమే విక్రయించాం
  • న్యాయవాది బబితా పవార్‌

వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలో బస్టాండ్‌ సమీపంలో సర్వే నెంబర్లు 1119, 1120లో ఉన్న భూమి తమదేనని, ఎండోమెంట్‌కి ఎలాంటి సంబంధం లేదని హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది బబితాపవార్‌ చెప్పారు. సదరు భూమికి తామే అసలైన వారసులమని పేర్కొన్నారు. శుక్రవారం ఆమె నీలం బిల్డర్స్‌ యజమాని నీలంగౌడుతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వే నంబర్లు 1119, 1120లలో మొత్తం 14 ఎకరాల భూమి ఉండగా తమ తాత రానోజిరావుతో పాటు ఆయన ఇద్దరు సోదరులు, మరో కుటుంబానికి చెందిన మానాజిరావు, నర్సింగ్‌రావులు ఇనాంగా పొందారని అన్నారు. అయితే 1968 సంవత్సరంలో 6.18 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించగా మిగిలిన భూమిని అందరూ పంచుకున్నామన్నారు. అయితే మరో కుటుంబానికి చెందిన మానాజిరావు, వారి సోదరులు తమ భాగాన్ని విక్రయించారన్నారు. తమ భూమి 3.18 ఎకరాలు ఉండగా నా భాగానికి 23 కుంటలు వచ్చిందని ఆమె తెలిపారు. తమ నాన్న నారాయణరావు నుంచి న్యాయబద్ధంగా వచ్చిన భూమిని మాత్రమే తాను విక్రయించానని వివరించారు. అయితే 1972లోనే ప్రత్యేకంగా గ్రూప్‌ ఆఫ్‌ టెంపుల్స్‌ కమిటీ ఉండడం చెల్లదని ప్రభుత్వం తేల్చిందని, అసలు ఈ భూమికి ఎండోమెంట్‌కు ఎలాంటి సంబంధం లేదని  2013లో వనపర్తి ఆర్డీవో స్పష్టంగా ఓఆర్‌సీ ఇచ్చిందని, ధరణి వెబ్‌సైట్‌లో పట్టాదారు పాసుపుస్తకాలు సైతం నమోదు చేశారని ఆమె అన్నారు. అయితే ఎండోమెంట్‌ వారు తమకు ఓఆర్‌సీ వచ్చిన తర్వాత మహబూబ్‌నగర్‌ జేసీ తమకే అనుకూలం చేయగా దానిని పెండింగులో పెట్టి కేసును హైకోర్టులో వేశారని ఆమె తెలిపారు. అయితే తమ కుటుంబంలో ఒకరైన బాలకిషన్‌రావు పవార్‌ 92 ఏళ్ల వృద్ధుడు కావడంతో కేసును త్వరగా ముగించాలని న్యాయమూర్తికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోగా మళ్లీ వనపర్తి జేసీ దగ్గరకు కేసును పంపించారన్నారు. గతంలో ఆర్డీవో ఇచ్చిన ఓఆర్‌సీని వనపర్తి జేసీ సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో తన వాట భూమితో పాటు సోదరుడు రాజ్‌కుమార్‌ పవార్‌కు చెందిన వాట భూమిని విక్రయించామని ఆమె తెలిపారు. తమకు వారసత్వంలో భాగంగా చట్టపరంగా వచ్చిన భూమి కనుక సర్వాధికారాలు తమకే ఉంటాయని, అయితే ఎండోమెంట్‌ వారు హైకోర్టులో తెచ్చుకున్న స్టేలో కేవలం ఇకముందు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని మాత్రమే ఉందని గుర్తు చేశారు. నీలంగౌడు మాట్లాడుతూ అన్ని పత్రాలు సక్రమంగా ఉండడం వల్ల  బబితా పవార్‌కు చెందిన 23 గుంటలు, రాజ్‌కుమార్‌ పవార్‌కు చెందిన 23 గుంటలు మొత్తం 46 గుంటల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నానని తెలిపారు. అయినా గత కలెక్టర్‌ శ్వేతామహంతి విడుదల చేసిన ఎండోమెంట్‌ భూముల సర్వే నంబర్లలో తాము కొనుగోలు చేసిన నంబర్లు లేవని అన్నారు. చట్టప్రకారం తాను కొనుగోలు చేసిన భూమిని మాత్రమే చదును చేస్తున్నానని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-02-08T10:40:21+05:30 IST