కేంద్రమంత్రులను కలిసిన ఎంపీ మన్నె

ABN , First Publish Date - 2020-02-12T12:03:58+05:30 IST

మహబూబ్‌నగర్‌ లోక్‌సభ సభ్యుడు మన్నె శ్రీనివాస్‌రెడ్డి సోమవారం కేంద్ర మంత్రులు నితిన్‌గడ్కరీ, రమేష్‌ పోఖ్రియాల్‌ని కలిశారు. వేర్వేరుగా ఇద్దరు మంత్రులను

కేంద్రమంత్రులను కలిసిన ఎంపీ మన్నె

  • జాతీయ రహదారిపై అండర్‌ పాసుల నిర్మాణాలకు వినతి
  • దేవరకద్రలో జవహర్‌ నవోదయ విద్యాలయం కోసం విన్నపం

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మహబూబ్‌నగర్‌ లోక్‌సభ సభ్యుడు మన్నె శ్రీనివాస్‌రెడ్డి సోమవారం కేంద్ర మంత్రులు నితిన్‌గడ్కరీ, రమేష్‌ పోఖ్రియాల్‌ని కలిశారు. వేర్వేరుగా ఇద్దరు మంత్రులను కలిసిన ఆయన తన నియోజకవర్గంలోని పలు పనులను వెంటనే చేపట్టాలని వినతిపత్రాలు అందజేశారు. తొలుత ఉదయం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీని కలిశారు. 44వ జాతీయ రహదారిపై కొత్తూరు నుంచి కొత్తకోట వరకు అండర్‌ పాసు బ్రిడ్జిలు, కొత్త సర్వీసు రోడ్లు, అండర్‌ బ్రిడ్జిలను నిర్మించాలని కోరారు. కొత్తకోట మండలం కనిమొట్ట వద్ద, మూసాపేట మండలం వేముల వద్ద, రాజాపూర్‌ మండలం ముదిరెడ్డిపల్లి వద్ద అండర్‌ బ్రిడ్జిలు, సర్వీసు రోడ్లు నిర్మించాలని కోరారు. ఈ మేరకు మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ని కలిసి పలు సమస్యలపై విన్నవించారు. ప్రధానంగా మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఎక్కడా జవహర్‌ నవోదయ విద్యాలయం లేదని, దేవరకద్ర నియోజకవర్గంలో ఈ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. వినతులపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని, త్వరలోనే క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకొని ఆ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా ఎంపీ తెలిపారు.

Updated Date - 2020-02-12T12:03:58+05:30 IST