రైతు వేదికలు..రెడీ
ABN , First Publish Date - 2020-11-03T10:17:39+05:30 IST
రైతులకు క్షేత్రస్థాయిలో సలహాలు, సూచనలందించే వ్యవస్థలతో పాటు సాగు, మార్కెటింగ్ తదితర అంశాలపై ఎప్పటికప్పుడు చర్చించేందుకు రూపొందించిన రైతు వేదికలు అందుబాటులోకి వస్తున్నాయి
ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 463 వేదికలు మంజూరు
యుద్ధప్రాతిపదికన జరుగుతున్న పనులు
ఒక్కో వేదికకు రూ.22 లక్షలు కేటాయించిన సర్కారు
విరాళాలతో అదనపు హంగులు
వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.. సాగులో తోడ్పాటు అందించేందుకు రైతుబంధు సమన్వయ సమితులు, క్లస్టర్ల వారీగా ఏఈవోలను నియమించింది.. తాజాగా పంటలపై సూచనలు, సలహాలు అందించడంతో పాటు అన్నదాతలు సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు రైతు వేదిక నిర్మాణాలను ప్రారంభించింది.. ఒక్కో వేదిక నిర్మాణానికి రూ.22 లక్షలను కేటాయించి, పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయిస్తోంది.. దీనికితోడు స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు స్వచ్ఛందంగా భూములు, దాతల నుంచి విరాళాలు సేకరించి, ఈ వేదికలను మరింత అందంగా తీర్చిదిద్దుతున్నారు..
మహబూబ్నగర్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : రైతులకు క్షేత్రస్థాయిలో సలహాలు, సూచనలందించే వ్యవస్థలతో పాటు సాగు, మార్కెటింగ్ తదితర అంశాలపై ఎప్పటికప్పుడు చర్చించేందుకు రూపొందించిన రైతు వేదికలు అందుబాటులోకి వస్తున్నాయి. మహత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను ఈ వేదికల నిర్మాణాలకు ఉపయోగించుకోగా, కొన్ని చోట్ల రైతులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి నిర్మాణాలు చేపట్టారు. ఒక్కో వేదికకు ప్రభుత్వం రూ.22 లక్షలు మంజూరు చేయగా, కొన్ని చోట్ల రైతుబంధు సమితులు చొరవ తీసుకొని విరాళాలు, ఇతర నిధులు సమకూర్చుకొని అదనపు హంగులు సమకూర్చుకున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 476 రైతు వేదికల నిర్మాణాలు చేపట్టగా, వీటిల్లో 463 వేదికలను ఉపాధి నిధులతో, పది వేదికలను ఇతర శాఖల నిధులతో చేపట్టారు. వనపర్తి జిల్లాలో మూడు రైతు వేదికలు దాతల ఆర్థిక సహాయంతో నిర్మించారు. ఇవి అందుబాటులోకి వస్తే రైతులకు క్షేత్రస్థాయిలో ఒక కార్యాలయం, సమావేశ మందిరం అందుబాటులోకి రానుంది. క్లస్టర్ల వారీగా భూముల స్వభావానికి అనుగుణంగా సాగుపై అవగాహన కల్పించడం, ఆధునిక సాగు విధానాలపై శిక్షణ ఇవ్వడం, విత్తనాలు, ఎరువులు అందజేయడం, సాగులో ఎప్పటికప్పుడు ఆ పరిధిలో వచ్చే సమస్యలను గుర్తించి తక్షణం నివారణ చర్యలపై సూచనలివ్వడం, రైతులు సమావేశాలు నిర్వహించుకోవడం, మార్కెటింగ్ సమస్యలున్నప్పుడు ముందుకెళ్లేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించేందుకు ఈ వేదికలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
జోగుళాంబ గద్వాల జిల్లాలో 94 కస్టర్లుగా గుర్తించి ఐదు నుంచి ఆరు గ్రామాలకు కలిపి ఒక రైతు వేదికను నిర్మిస్తున్నారు. ఉపాధి హామీ పథకం నుంచి రూ.10 లక్షలు, వ్యవసాయ శాఖ నుంచి రూ.12 లక్షలు కలిపి మొత్తం రూ.22 లక్షలు చొప్పున ఒక్కో నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రైతు సమస్వయ సమితి అధ్యక్షులు, సింగిల్ విండో అధ్యక్షులు, రైతు నాయకులు మాత్రం తమ గ్రామాల్లో జరిగే రైతు వేదిక నిర్మాణాలు, జిల్లాలో అన్నింటికంటే అందంగా ఉండాలని పోటీ పడుతున్నారు. ఇందు కోసం విరాళాలు సేకరించి దాదాపు ఒక్కో నిర్మాణానికి రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు.అయిజ మండలం ఉత్తనూరులో, మల్దకల్ మండలం కుర్తిరావులచెరువు గ్రామంలో రైతు వేదికల్ని భారీగా నిధులు ఖర్చుచేసి నిర్మాణాలు జరుపుతున్నారు. భవనపై అందమైన పేయింటింగులు, కూర్చోవడానికి కుర్చీలు, రైతులకు సమాచారం, పంటల సమాచారం తెలియచేయడానికి మినీ థియేటర్, సౌండ్ బాక్స్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆరుబటయ గార్డెన్లు, పూల మొక్కలు, రైతు రాజసం ఉట్టిపడే విధంగా ఎద్దుల బండి, నాగలి దున్నుతున్న రైతు బొమ్మలను ఏర్పాటు చేశారు.
వారంలో పూర్తి చేసేలా కార్యాచరణ
రైతు వేదికల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఉమ్మడి జిల్లాలోని వనపర్తి జిల్లాలో ఇప్పటికే వంద శాతం నిర్మాణాలు పూర్తి చేసుకోగా, మిగిలిన జిల్లాల్లోనూ చాలా వరకు చివరి దశకు చేరాయి. ఈ వారాంతంలోగా అన్ని వేదికలను అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళిక అమలు చేస్తున్నారు. కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షిస్తూ పనులను జాప్యం లేకుండా చూస్తున్నారు.
జిల్లా మొత్తం ఈజీఎస్ ఇతర పూర్తి చివరి ఇతర
వేదికలు నిధులతో నిధులతో దశలో దశలో
మహబూబ్నగర్ 88 87 01 30 39 19
నారాయణఫేట 77 77 నిల్ 62 15 00
నాగర్కర్నూల్ 143 137 06 25 45 73
వనపర్తి 71 68 నిల్ 71 00 00
గద్వాల 97 94 03 79 17 01
మొత్తం 476 463 10 267 116 93