కాటేస్తున్న కరోనా
ABN , First Publish Date - 2020-08-16T10:39:17+05:30 IST
వైరస్ వ్యాప్తి తీవ్రమవుతోంది. రోజు రోజుకు కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది.
![కాటేస్తున్న కరోనా](https://media.andhrajyothy.com/appimg/galleries/2020081605013530/08162020050915n36.jpg)
తీవ్రంగా వ్యాపిస్తున్న వైరస్
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 223 కేసులు నమోదు
మహబూబ్నగర్లో ఆరుగురు, జోగుళాంబ గద్వాల జిల్లాలో ముగ్గురు మృతి
వనపర్తి-ఆంధ్రజ్యోతి/మహబూబ్నగర్ (వైద్యవిభాగం)/గద్వాల క్రైం/నాగర్కర్నూల్ క్రైం/నారాయణపేట క్రైం/జడ్చర్ల, ఆగస్టు 15 : వైరస్ వ్యాప్తి తీవ్రమవుతోంది. రోజు రోజుకు కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. తాజాగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 223 కేసులు నమోదు అయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాలో ఆరుగురు, జోగుళాంబ గద్వాల జిల్లాలో మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు.
మహబూబ్నగర్ జిల్లాలో శనివారం 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, అందులో ఆరు మంది చనిపోయారు. జిల్లా కేంద్రంలోనే 53 మందికి వైరస్ సోకగా, ఒక్క ఏనుగొండలోనే 11 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో పాటు జిల్లాలోని వివిధ మండలాలలో 17 మందికి కరోనా వైరస్ అని తేలింది. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని ఏనుగొండలోని శ్రీరామకాలనీలో ఒకే ఇంట్లో ఐదుగురికి, మరో ఇంట్లో ముగ్గురికి, ఇంకో ఇంట్లో ఒకరికి, వివేకనందకాలనీలో ఒకరికి, వాసవికాలనీలో ఇంకొకరికి వైరస్ నిర్ధారణ అయ్యింది. మిగతా కేసులు వెంకటేశ్వరకాలనీ, మర్లు, బాలాజీనగర్, రామయ్యబౌళి, షాషాబ్గుట్ట, రాజేంద్రనగర్, హన్మాన్పుర కాలనీలలో నమోదయ్యాయి.
జడ్చర్లలోని లింగంపేటలో ఒకటి, పట్టణంలో 8, మహబూబ్నగర్ మండలం వెంకటాపూర్, ధర్మాపూర్, జమిస్తాపూర్, పాల్కొండతండా, దొడ్డలోనిపల్లిలలో ఒక్కొక్కరి చొప్పున 5 మందికి, రాజాపూర్ మండల కేంద్రంలో ఒకటి, గండీడ్ మండలం షేక్పల్లిలో ఒకటి, దేవరకద్ర మండలంలోని తెలుగుగేరి, హజిలాపూర్లలో ఒక్కొక్కటి కేసులు వచ్చాయి. ఇదిలా ఉండగా జిల్లాలో ఒక్కరోజే కరోనాతో ఆరు మంది మరణించారు. అందులో పట్టణంలోని వీరన్నపేటలో ఓ మహిళ, శ్రీనివాసకాలనీలో ఓ వృద్ధుడు, పాల్సాబ్గుట్టలో ఒకరు, బాలాజీనగర్లో 38 ఏళ్ల మహిళ, ఏనుగొండలో ఓ వ్యక్తి, మూసాపేట మండలం నిజాలాపూర్లో ఒకరు చనిపోయారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో శనివారం 33 కేసులు నమోదు కాగా, ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందారు. కొవిడ్, ర్యాపిడ్ ల్యాబ్లలో ఎనిమిది కేసులు నమోదు కాగా, అందులో జిల్లా కేంద్రంలోనే ఐదుగురికి పాజిటివ్ అని తేలింది. వీటితో పాటు చింతలకుంట, పెంచికలపాడు, అయిజలో ఒకొక్కరు చొప్పున వైరస్ బారిన పడ్డారు. కొవిడ్ ల్యాబ్లో గట్టు మండలం పెంచికలపాడులోని ఓ మహిళ (62) కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందింది. గట్టులో రెండు, మల్దకల్లో రెండు, ఇటిక్యాలలో రెండు, మానవపాడులో రెండు, అయిజలో ఏడు, వడ్డెపల్లిలో రెండు, అలంపూర్లో ఎనిమిది కేసులు నమోదయ్యాయి.
నారాయణపేట జిల్లాలో ఒకే ఒక్క కేసు దామరగిద్ద మండలంలో నమోదైంది.
వనపర్తి జిల్లాలో 42 కరోనా కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వనపర్తి మండలంలో 33 మందికి, గోపాల్పేటలో ముగ్గురికి, పెబ్బేరులో ఇద్దరికి, కొత్తకోట, చిన్నంబావి, మదనాపురం, వీపనగండ్లలో ఒకొక్కరు చొప్పున కరోనా బారిన పడ్డారు.
నాగర్కర్నూల్ జిల్లాలో 77 మందికి వైరస్ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అందులో ఒక్క నాగర్కర్నూల్లోనే 27 మందికి వైరస్ సోకింది. ఇక కోడేరు, తాడూరు, కొల్లాపూర్, లింగాల, పెద్దకొత్తపల్లిలో ఒకొక్కరి చొప్పున, ఉప్పునుంతల, బల్మూరులో ఇద్దరికి చొప్పున కల్వకుర్తిలో ఐదుగురికి, బిజినేపల్లిలో ముగ్గురికి, వెల్దండలో ముగ్గురికి, అచ్చంపేటలో 15 మందికి, తెలకపల్లిలో ఆరుగురికి, ఊర్కొండలో తొమ్మిది మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది.