బాధిత కుటుంబానికి చెక్కు అందజేత
ABN , First Publish Date - 2020-09-14T10:51:19+05:30 IST
విద్యుత్ షాక్తో మృతి చెందిన పట్టణంలోని వీరన్నపేటకు చెందిన ఎంఏ సాజిద్, ఎండీ ఖాజల కుటుంబీకులకు మంత్రి
మహబూబ్నగర్, సెప్టెంబరు 13: విద్యుత్ షాక్తో మృతి చెందిన పట్టణంలోని వీరన్నపేటకు చెందిన ఎంఏ సాజిద్, ఎండీ ఖాజల కుటుంబీకులకు మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వం తరపున విద్యుత్శాఖ నుంచి ఆదివారం రూ.10 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైటెన్షన్ వైర్ల కింద కొందరు పేదలు ఇళ్లను నిర్మించుకుని ప్రమాదాలకు గురవుతున్నారని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎక్కడైనా ఇళ్లపై విద్యుత్ తీగలు వేలాడుతున్నా, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నా అధికారుల దృష్టికి తేవాలన్నారు.
జంక్షన్ల పరిశీలిన: పట్టణంలోని గడియారం చౌరస్తాలో చేపడుతున్న జంక్షన్ అభివృద్ధి పనులను మంత్రి శ్రీనివాస్గౌడ్ పరిశీలించారు. ఆక్రమణలు తొందరగా తొలగించుకుంటే రహదారి విస్తరణ వేగంగా చేపట్టే అవకాశం ఉంటుందన్నారు.
రోజూ నీటి సరఫరా: పట్టణంలో రోజూ తాగునీరు సరఫరా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. శ్రీనివాస కాలనీలో తాగునీటి పనులను పరిశీలించిన ఆయన మాట్లాడారు. రోజూ నీటి సరఫరాపై త్వరలో అధికారులతో సమావేశం అవుతానన్నారు. ఈలోగా ఆయా వార్డుల్లో ఉన్న అవకాశాలను కౌన్సిలర్లు అధికారులతో చర్చించి విధివిధానాలను రూపొందించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మునిసిపల్ చైర్మన్ కోరమోని నర్సింహులు, వైస్ చైర్మన్ తాటిగణేష్, నాయకులు పాల్గొన్నారు.