రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని రాస్తారోకో
ABN , First Publish Date - 2020-12-04T03:35:06+05:30 IST
రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. గురువారం వంగూరు గేటు వద్ద హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపై రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
వంగూరు, డిసెంబరు 3: రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. గురువారం వంగూరు గేటు వద్ద హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపై రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నాయకులు, రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు కిలోమీటరు పొడవునా నిలిచిపోయాయి. స్థానిక పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో కొంతసేపటి తర్వాత వారు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్కుమార్రెడ్డి, కల్వకుర్తి మునిసిపల్ చైర్మన్ ఎడ్మసత్యంలు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేయడానికే ఈ చట్టం తీసుకుని వచ్చిందని ఆరోపించారు. కార్పొరేటు సంస్థలకు లాభం చేకూరేలా ఉన్న ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బాలస్వామి, శివరాములు, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.