కరోనా కాక
ABN , First Publish Date - 2020-06-18T10:55:23+05:30 IST
కరోనా వైరస్ విజృంభిస్తోంది.. వాళ్లు, వీళ్లు అనే తేడా లేకుండా అందరినీ భయపెడుతోంది..

వైద్య సిబ్బందిని వదలని వైరస్
డాక్టర్తో పాటు మరో ముగ్గురికి పాజిటివ్
ఆందోళన చెందుతున్న మిగతా సిబ్బంది
మహబూబ్నగర్ (వైద్యవిభాగం), జూన్ 17 : కరోనా వైరస్ విజృంభిస్తోంది.. వాళ్లు, వీళ్లు అనే తేడా లేకుండా అందరినీ భయపెడుతోంది.. ఇప్పటి వరకు ప్రజలను అంటుకున్న ఈ వైరస్, ఇప్పుడు వైద్యులు, వైద్య సిబ్బందికి కూడా వ్యాపించింది.. పది రోజుల్లో మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రిలో ఒక వైద్యురాలు, మరో ముగ్గురు సిబ్బందికి వైరస్ సోకింది.. దీంతో మిగతా సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని విధులు నిర్వర్తిస్తున్న పరిస్థితి నెలకొన్నది..
కరోనా వ్యాప్తి మహబూబ్నగర్ జిల్లాలో రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇది వరకు జిల్లాలో 11 కేసులు మాత్రమే ఉండేవి. కానీ, ఈ 15 రోజుల నుంచి ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరుగుతోంది. రోజుకు రెండు నుంచి నాలుగు కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పని చేసే ఓ వైద్యురాలు, ముగ్గురు సిబ్బందికి వైరస్ సోకింది. ఆసుపత్రిలోని నర్సింగ్ విభాగంలో పని చేసే ఓ ఎంఎన్వోకు వైరస్ సోకింది.
వేపూర్కు చెందిన ఓ పాజిటివ్ వ్యక్తికి వైద్యసేవలు అందించడంతో ఇతనికి వైరస్ వ్యాపించింది. ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేసే ఓ కంప్యూటర్ ఆపరేటర్కు పాజిటివ్ వచ్చింది. రేడియాలజి విభాగంలోని ఓ ఎక్స్రే టెక్నీషియన్కు కూడా పాజిటివ్ వచ్చింది. ఈమె కూడా పాజిటివ్ రోగికి ఎక్స్రే తీయడం వల్ల కాంటాక్టు అయ్యిందని గుర్తించారు. ఇదిలా ఉండగా గైనిక్ విభాగంలోని ఓ వైద్యురాలికి కూడా వైరస్ సోకింది. పాజిటివ్ మహిళకు వైద్యసేవలు అందించడంతో ఈ వైద్యురాలు కరోనా బారిన పడ్డారు.