అలసత్వంపై ఆగ్రహం

ABN , First Publish Date - 2020-12-07T03:25:46+05:30 IST

మునిసిపాలిటీ అద్దె దుకాణాల లెక్కలు తేల్చేందుకు అధికార యం త్రాంగం నడుంబిగించింది.

అలసత్వంపై ఆగ్రహం
దుకాణాల తనిఖీ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ తేజస్‌పవార్‌

ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన అడిషినల్‌ కలెక్టర్‌


అద్దె దుకాణాల లెక్కలు తేల్చేందుకు ఆపరేషన్‌ షురూ



అధికారులతో కలిసి దుకాణాల తనిఖీ


మునిసిపాలిటీలో హెల్ప్‌డెస్క్‌


స్పష్టత ఇవ్వకపోతే రెండ్రోజుల్లో షాపుల సీజ్‌


చార్జ్‌ ఇవ్వని రిటైర్డ్‌ అధికారికి క్రిమినల్‌ నోటీస్‌


మహబూబ్‌నగర్‌, డిసెంబరు 6: మునిసిపాలిటీ అద్దె దుకాణాల లెక్కలు తేల్చేందుకు అధికార యంత్రాంగం నడుంబిగించింది. మునిసిపాలిటీకి చెల్లించాల్సిన అద్దెలు ఎంత.. అద్దెలు చెల్లించని బకాయిలు ఎంత.. దారి మళ్లుతున్న అద్దెల వివరాలు తేల్చేందుకు అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ వార్‌ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ మొదలైంది. లెక్కలేనితనం శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ఆదివారం ప్రచురితమైన కథనంపై అడిషినల్‌ కలెక్టర్‌ సీరియస్‌గా స్పందించారు. వెంటనే అందుబాటులో ఉన్న అధికారులతో సమావేశమై వారిని తీసుకొని గడియారం చౌరస్తాలోని పలు దుకాణాలను విజిట్‌ చేశారు. అద్దె చెల్లించకపోతే రెండ్రోజుల్లో దుకాణాలను సీజ్‌ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఏఏ దుకాణం ఎంత అద్దెలు చెల్లిస్తున్నారు.. ఎంత బకాయి ఉందో తదితర వివరాలను తెలిపేందుకు మునిసిపల్‌ కార్యాలయంలో సోమవారం హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దుకాణదారులు తమ వద్ద ఉన్న రశీదులతో హెల్ప్‌ డెస్క్‌ను సంప్రదించి వివరాలు నమోదు చేయించాలి. రెండ్రోజుల్లో అందరూ హెల్ప్‌ డెస్క్‌ను సంప్రదించి వివరాలు అందజేసి అద్దె చెల్లింపులపై స్పష్టత తీసుకోవాలి.

లెక్కలు చెల్లించకుంటే దుకాణాల సీజ్‌


లెక్కలు చెల్లించని దుకాణాలను రెండ్రోజుల్లో సీజ్‌ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. క్లాక్‌టవర్‌లో మూడేళ్ల కిందట వేలంలో దక్కించుకున్న పలు దుకా ణాల అద్దె రూ.25 నుంచి 30 లక్షల వరకు పెండిం గ్‌లో ఉండడంపై అడిషనల్‌ కలెక్టర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ని లక్షల అద్దె చెల్లించకుండా పెండింగ్‌లో ఉంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వెంటనే అద్దె వసూళ్ల కోసం స్షెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. పెండింగ్‌ అద్దె వసూలు చేయడంతోపాటు లెక్కలను సరి చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. కొన్ని దుకాణాల సముదాయాలకు అతి తక్కువ ధరకే కట్టబెట్టడంపై హాట్‌ చర్చ జరుగుతోంది. క్లాక్‌టవర్‌లో లక్షలు చెల్లించాల్సిన దుకాణాలను ఒకరికే వేలకు కట్టబెట్టడంపైనా ఆరా తీస్తున్నారు.  కాగా అద్దెలు వసూలు చేసే ఆర్‌ఐ షకీల్‌ మూడు నెలల క్రితం ఉద్యోగ విర మణ చేయగా ఆయన ఎలాంటి రికార్డ్‌లు, చార్జ్‌ ఇవ్వకపోవడంపై నేడు క్రిమినల్‌ నోటీస్‌ జారీ చేయాలని నోటీసు సిద్ధం చేశారు. నోటీసు అందుకున్న రెండ్రోజుల్లో చార్జ్‌ ఇవ్వకపోతే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఇన్‌చార్జి కమిషనర్‌ సత్యనారాయణ వెల్లడించారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురిత మైన కథనంతో అధికారులు పరుగులు పెట్టడం, దు కాణదారులకు హెచ్చరికలు జారీ చేయడంతో వాళ్లంతా తాము చెల్లించిన రశీదులు, బకాయిల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. 



Updated Date - 2020-12-07T03:25:46+05:30 IST