బలవంతపు భూసర్వే చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటాం
ABN , First Publish Date - 2020-07-14T22:25:48+05:30 IST
ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేకు బలవంతపు భూసర్వే నిలిపివేయాలని లేకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని చింతకాని మండలంలోని
వైరా (ఆంధ్రజ్యోతి): ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేకు బలవంతపు భూసర్వే నిలిపివేయాలని లేకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని చింతకాని మండలంలోని పలు గ్రామాల రైతులు హెచ్చరించారు. వైరా ఏసీపీ కె.సత్యనారాయణకు ఒక వినతిపత్రం సమర్పించారు. చింతకాని మండలం బస్వాపురం రెవెన్యూ పరిధిలోని రాఘవాపురం, బస్వాపురం, రామకృష్టాపురం, అల్లీపురం గ్రామ భూనిర్వాసితులైన రైతులు సోమవారం వైరా ఏసీపీ కె.సత్యనారాయణను కలిసి తమ గోడును వెలిబుచ్చుకున్నారు.
బలవంతపు భూసర్వేను వెంటనే నిలిపివేయాలని, రైతులమైన తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని అలాగే నష్టపరిహార విషయంలో గత రెండేళ్ల కిందట ఖమ్మంజిల్లా రఘునాథపాలెం మండలం వీ.వెంకటాయపాలెం దగ్గర కొత్త కలెక్టరేట్కు రైతులకు చెల్లించిన నష్టపరిహారాన్ని పరిగణలోకి తీసుకొని తమకు న్యాయం చేయాలని ఆవినతిపత్రంలో కోరారు. ఈ నేపథ్యంలో ఏసీపీ సత్యనారాయణ స్థానికంగా ఓ కల్యాణమండపంలో రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాలను రైతులకు వివరించారు. రైతులు తమకు సహకరించాలని సూచించారు. వైరా సీఐ జె.వసంతకుమార్, చింతకాని ఎస్ఐ ఉమ పాల్గొన్నారు.