మరొకరికి పాజిటివ్
ABN , First Publish Date - 2020-05-21T10:04:53+05:30 IST
ఖమ్మం జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. పెనుబల్లి మండలం వీఎం బంజర్ నుంచి జీవనోపాధి కోసం పూనె వెళ్లి వారంరోజుల క్రితం
ఖమ్మం జిల్లా వీఎంబంజర్లో కరోనా కలకలం
పూనె వెళ్లొచ్చిన ఓ మహిళకు లక్షణాలు
పెనుబల్లి, మే 20: ఖమ్మం జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. పెనుబల్లి మండలం వీఎం బంజర్ నుంచి జీవనోపాధి కోసం పూనె వెళ్లి వారంరోజుల క్రితం గ్రామానికి తిరిగొచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు జిల్లా వైద్యాధికారులు ధ్రువీకరించారు. దీంతో అటు అధికారులు, ఇటు ప్రజల్లో ఆందోళన మొదలైంది. పెనుబల్లి మండలం వీఎంబంజర్కు చెందిన సుమారు 220మంది జీవనోపాధి కోసం మూలికా వైద్యం చేస్తుంటారు. వారంతా మహారాష్ట్ర, గుజరాత్, బిహార్ తదితర రాష్ట్రాలకు వెళ్లారు. లాక్డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోగా.. సడలింపు ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈనేపథ్యంలో వారిని వీఎంబంజరలోని ఉన్నత పాఠశాల, లంకపల్లి, కుప్పెనకుంట్లలోని గురుకుల పాఠశాలల్లో క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచారు.
అయితే పూనె వెళ్లివచ్చిన ఏడుగురిలో ఓ భార్య, భర్తను అనుమానితులుగా గుర్తించిన అధికారులు మూడురోజుల క్రితం ఖమ్మంలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా.. వారిలో 29సంవత్సరాల మహిళకు పాజిటివ్ వచ్చిందని నిర్ధారించారు. అయితే వీరు ఇటీవల మధిర మహదేవపురంలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో పాటే పూనె వెళ్లి వచ్చినట్టు తెలిసింది. ఆ మహిళతో కాంటాక్టు ఉన్నవారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమవగా.. క్వారంటైన్ ఉన్నవారికి భోజనం, నిత్యావసరాలను అందజేసిన దాతలు, వారితో పాటు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న వారిలో ఆందోళన మొదలైంది. మరోవైపు పాజిటివ్ కేసు నమోదైన మహిళ నివాసం ఉండే ప్రాంతాన్ని అధికారులు కట్టడిలోకి తీసుకున్నారు. పరిసరాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టారు. అలాగే క్వారంటైన్లో ఉన్నవారికి అధికారులు అవగాహన కల్పించారు. కరోనా నియంత్రణలో భాగంగా జాగ్తత్తలు తీసుకోవాలని, భౌతికదూరం పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు.