మధిరలో రియల్ ఆగడాలు!
ABN , First Publish Date - 2020-12-20T04:13:14+05:30 IST
మధిర మునిసిపాలిటీలో రియల్ వ్యాపారుల ఆగడాలు ఆగటంలేదు.

భగీరఽథ పైపులైన్, కాల్వలు
ఆక్రమించి వెలిసిన వెంచర్లు
ఆరుఅడుగులు ఆక్రమించిన వైనం
గుర్తించిన అధికారులు
మధిర, డిసెంబరు 19: మధిర మునిసిపాలిటీలో రియల్ వ్యాపారుల ఆగడాలు ఆగటంలేదు. ఒకవైపు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ సమస్యతో ఇప్పటికే ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు ఇబ్బందులుపడుతుంటే మరో వైపు అదేపనిగా రియల్ వెంచర్లు వెలుస్తున్నాయి. ఇందుకు అధికార పార్టీ నాయకులు అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మధిర పట్టణంలోని ఇల్లెందులపాడుకు ఆనుకొని కొత్తగా వెంచర్లు వెలిశాయి. ఆర్అండ్బీ రోడ్డుకు ఆనుకొని మిషన్ భగీరథ పైపులైన్ను కూడా ఆక్రమించి వెంచర్ వ్యాపారులు ముళ్ల కంచె బాతారు. వాటర్ పైప్లైన్కూడా కబ్జాచేశారు. ఇల్లెందులపాడు నుంచి వచ్చే వరద కాలువకూడా ఆక్రమణలకుగురైంది. మధిర మునిసిపాలిటీ పరిధిలోని నాల్గవ వార్డులో ఈ తతంగం నడుస్తుంది. అంతేకాక కృష్ణాపురం వైపు కూడా ఒక బారీ వెంచర్ వెలిసింది. దానికి ఇంతవరకు అనుమతులు రాకపోయినా పక్కా లేఅవుట్ అని నమ్మబలికి ఇప్పటికే అమ్మకాలు జరుపుతున్నారు. 20ఎకరాల్లో ఈ వెంచర్ వేసినట్లు నిర్వాహకులు ప్రచారం చేస్తున్నారు. కాని ఇక్కడ నిబంధనల ప్రకారం ఇంకా రోడ్డపనే పూర్తికాలేదు. కాని అమ్మకాలు మాత్రం జొరందుకున్నాయి. దీంతో పలువురు ప్రజలు విస్తుపోతున్నారు. పట్టణంలోనే లేని ధరలు పెట్టి అనేక ఆధునిక సౌకర్యాలంటూ నమ్మబలుతున్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన వారికి ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారో వారికే తెలియాలి. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈవిషయమై సీపీఐ పట్టణ కార్యదర్శి బెజవాడ రవిబాబు ఆర్డబ్ల్యుఎస్, మున్సిపల్ టౌన్ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదుచేయడంతో శనివారం అధికారులు ఇల్లెందులపాడు వెంచర్ను కలిసి రోడ్డువైపు ఆరు అడుగుల మేర ఆక్రమించినట్లు మార్కింగ్ చేశారు. దీంతో మిగిలిన వెంచర్ల విషయంలోనూ అధికారులు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు రవిబాబు డిమాండ్ చేశారు, అలాగే మరో సారి లేఅవుట్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అన్ని వార్గాల ప్రజలు కోరుతున్నారు.
ఈ విషయమై టౌన్ ప్లానింగ్ అధికారి బాస్కర్ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ఇంకా అనుమతులు ఇవ్వలేదనితెలిపారు. ప్రాసె్సలో ఉందని అన్ని పక్కాగా ఉంటేనే అనుమతులు ఇస్తామన్నారు. అప్పటి వరకు ఎలాంటి అమ్మకాలు జరపరాదని తెలిపారు.