బూజుపడుతున్న కందిపప్పు
ABN , First Publish Date - 2020-11-03T09:59:15+05:30 IST
చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన రూ. కోట్ల విలువైన కందిపప్పు తుట్టెలు కట్టి బూజూ పడుతోంది.
రేషన్షాపుల్లో మూలుగుతున్న 250 టన్నుల నిల్వలు
నాలుగు నెలలుగా పంపిణీ చేయని డీలర్లు
వైరా, నవంబరు 2: చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన రూ. కోట్ల విలువైన కందిపప్పు తుట్టెలు కట్టి బూజూ పడుతోంది. నాలుగునెలలుగా రేషన్షాపుల్లోనే కందిపప్పు మూలుగుతోంది. షాపుల్లో ఉన్న కందిపప్పును కొంతమందికైనా పంపిణీ చేసే అవకాశం ఉన్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఖమ్మం జిల్లాలోని అన్నిమండలాల్లో రూ.రెండున్నరకోట్ల విలువైన సుమారు 250టన్నుల కందిపప్పు రేషన్షాపుల్లో బూజుపట్టి పాడైపోయే స్థితికి చేరింది.
లాక్డౌల్ వచ్చిన నిల్వలు
కరోనా విజృంభించిన సమయంలో మార్చినెలలో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. పేదలకు నిత్యావసర సరుకుల కొరత రాకూడదని కేంద్రప్రభుత్వం రేషన్షాపుల ద్వారా కార్డుదారులకు ఒక కిలో చొప్పున కందిపప్పు ఉచితంగా పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. గత మేనెలలో ఈ కందిపప్పును విడుదల చేసింది. రాష్ట్రప్రభుత్వం ఆయా జిల్లాలకు దశలవారీగా అందుబాటులో ఉన్న కందిపప్పును పంపిణీ చేసింది. జూన్, జూలై నెలల్లో జిల్లాలోని 669రేషన్షాపుల పరిధిలో ఉన్న 4,04966కార్డుదారులకు కందిపప్పు సరఫరా చేసింది. వీరిలో ఆహారభద్రత కార్డులు 3,78,012, అంత్యోదయ, అన్నయోజన కార్డులు 26951, అన్నపూర్ణ పథకం కింద మూడు కార్డులున్నాయి. వీరందరికి జూలై నెలవరకు ఉచితంగా కందిపప్పును పంపిణీ చేశారు.
పంపిణీ చేయాలంటున్న పేదలు
ఒక దఫా పంపిణీ చేయగా జిల్లాలోని అన్ని రేషన్షాపుల్లో ఒక్కో మండలంలో 100నుంచి 125క్వింటాళ్ల వరకు కందిపప్పు మిగిలిపోయింది. రేషన్షాపుల్లో ఉన్న కందిపప్పు అక్కడి కార్డుదారులందరికి పంపిణీ చేసేందుకు సరిపోనందున ఆనిల్వలను అంతే ఉంచారు. ఆగస్టు నుంచి ఇప్పటివరకు నాలుగు నెలలుగా ఉన్న సుమారు 250టన్నుల కందిపప్పును పంపిణీ చేయకుండా వదిలేశారు. ఈ కందిపప్పు ఇలాగే ఉంటే పూర్తిగా పాడైపోయి రూ.రెండున్నరకోట్ల నష్టం జరిగే అవకాశముంది. ఇప్పటికే ప్రభుత్వం రేషన్షాపుల ద్వారా చక్కెరను కేవలం అంత్యోదయ, అన్నయోజన పథకం కార్డుదారులకే పంపిణీ చేస్తుంది. జిల్లావ్యాప్తంగా ఈ కార్డులు 26,951మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు రేషన్షాపుల్లో అందుబాటులో ఉన్న కందిపప్పును కనీసం ఈ కార్డుదారులకైనా ఉచితంగా సరఫరా చేయవచ్చు. కనీసం ఆదిశగా కూడా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా బూజుపట్టి పాడైపోయే స్థితికి చేరుకున్న ఉచిత కందిపప్పును తమకు పంపిణీ చేయాలని పేదలు కోరుతున్నారు.