పురుపోరుకు సన్నద్ధం
ABN , First Publish Date - 2020-12-06T04:47:47+05:30 IST
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల వేడి మొదలు కాబోతుంది. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తిచేసి ఆ వెంటనే ఎన్నికలకు వెళ్లాలని జిల్లా మంత్రి అజయ్కుమార్ యోచిస్తున్నారు. హైదరాబాదు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని ఖమ్మంకార్పొరేషనర్ గెలుపు ద్వారా పూడ్చుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది.

ఖమ్మంలో ప్రారంభానికి సిద్ధంగా రూ.215కోట్ల అభివృద్ధి పనులు
రేపు నగరంలో నలుగురు మంత్రుల పర్యటన
మొదలవుతున్న కార్పొరేషన్ ఎన్నికల వేడి
ఖమ్మం, డిసెంబరు 5(ప్రతినిధి): ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల వేడి మొదలు కాబోతుంది. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తిచేసి ఆ వెంటనే ఎన్నికలకు వెళ్లాలని జిల్లా మంత్రి అజయ్కుమార్ యోచిస్తున్నారు. హైదరాబాదు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని ఖమ్మంకార్పొరేషనర్ గెలుపు ద్వారా పూడ్చుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అందులో భాగంగా కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకోసం అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేసి ప్రారంభానికి ముహూర్తం ఖరారుచేశారు. ఖమ్మం నగరంలో రూ.215కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను సోమవారం ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం సోమవారం రాష్ట్ర ఐటీపురపాలక శాఖ మంత్రి కేటీఆర్, హోంమంత్రి మహమూద్అలీ, రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఖమ్మంలో పర్యటించనున్నారు. ఈ నలుగురు మంత్రులు హైదరాబాదు నుంచి హెలికాప్టర్ ద్వారా సోమవారం ఉదయం 10గంటలకు చేరుకుంటారు. ఉదయం 10-10గంటలకు రూ.1.25కోట్లతో ఖానాపురం ట్యాంక్బండ్, ఆ తర్వాత రూ.2.85కోట్లతో నిర్మించిన బల్లేపల్లి వైకుంఠధామం, రూ.18కోట్లతో నిర్మించిన ఖమ్మం ఇల్లెందు ఆర్అండ్బీ రహదారిలోని రోడ్లు డివైడర్లు, సెంట్రల్లైటింగ్, రూ.5కోట్లతో కోయచలక రోడ్డు విస్తరణ, రూ8.4కోట్లతో నిర్మించిన రఘునాధపాలెం నుండి వీవీపాలెం రహదారిని ప్రారంభిస్తారు. రూ.25లక్షలతో రఘునాధపాలెంలో నిర్మించిన ట్యాంక్బండ్, రూ.4.5కోట్లతో నిర్మించిన వాకింగ్ ట్రాక్, ప్రకృతివనం పార్కును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12గంటలకు లకారం ట్యాంక్బండ్పై రూ.11లక్షలతో నిర్మించిన దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు క్యాంస్య విగ్రహ ప్రారంభం, ఆతర్వాత రూ.77కోట్లతో నిర్మించిన ధంసలాపురంలో నిర్మించిన ఆర్వోబీ వంతెన ప్రారంభించి జయశంకర్ విగ్రహావిష్కరణ, రూ.3కోట్లతో నిర్మించిన నూతన పోలీసు కమిషనరేట్భవనం, రూ.70కోట్లతో నిర్మించిన గోళ్లపాడు ఛానల్, మధ్యాహ్నం 1-15గంటలకు రూ.27కోట్లతో నూతనంగా నిర్మించిన ఐటీహబ్ను ప్రారంభిస్తారు. అనంతరం మంత్రి పువ్వాడ నివాసంలో భోజనం చేసి సాయంత్రం 3గంటలకు హెలికాప్టర్లో హైదరాబాదు ప్రయాణమవుతారు.