సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2020-12-31T05:22:02+05:30 IST

ఖమ్మంనగరంలో రూ.25కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు కౌన్సిల్‌ సమావేశంలో ఆమోదించారు.

సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం
కౌన్సిల్‌ సమావేశానికి హాజరైన కార్పోరేటర్లు, అధికారులు

 రూ.25కోట్ల అభివృద్ధిపనులకు ఆమోదం

 లకారం ట్యాంక్‌బండ్‌పై తీగల వంతెనకు తీర్మానం

 ప్రశాంతంగా నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం

 సమస్యలు పరిష్కరిస్తాం: కమిషనర్‌ జయంతి

 హాజరైన ఎమ్మెల్సీ బాలసాని, ఎమ్మెల్యే కందాళ

ఖమ్మం కార్పొరేషన్‌, డిసెంబరు 30: ఖమ్మంనగరంలో రూ.25కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు కౌన్సిల్‌ సమావేశంలో ఆమోదించారు. బుధవారం ఖమ్మం నగరపాలక సంస్ధ కౌన్సిల్‌ సమావేశం సమావేశ మందిరంలో మేయర్‌ డాక్టర్‌. జీ.పాపాలాల్‌ అధ్యక్షతన నిర్వహించారు. టేబుల్‌ అజెండాతో సహా మొత్తం 26 అంశాలను ఈ సమావేశంలో ఆమోదించారు. ఇందులో లకారం ట్యాంక్‌బండ్‌పై తీగెల వంతెన నిర్మాణానికి రూ.10.75 కోట్లు కేటాయిస్తూ మేయర్‌ తీర్మానం చేయగా, సభ్యులు ఆమోదించారు. అనంతరం నగరపాలక సంస్థకు వచ్చిన ఎస్‌ఎ్‌ఫసీ నిధులు రూ.9.75కోట్లతో చేపట్టే పనులకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అలాగే నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. కాగా కౌన్సిల్‌ సమావేశంలో పాత సమస్యలే పునరావృతం కాగా వాటి పరిష్కారం పట్ల తూతూ మంత్రంగా హామీలిచ్చారు. ఐదేళ్లుగా ఇవే సమస్యలు చెబుతున్నా పరిష్కారం కావటంలేదని ప్రతిపక్ష కార్పొరేటర్లతో పాటు టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు కూడా పేర్కొన్నారు. ఈ కౌన్సిల్‌ సమావేశానికి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి హాజరుకాగా, మొత్తానికి సమావేశం ఎటువంటి వాగ్వాదాలు లేకుండా ప్రశాంతంగా సాగింది.


పాత సమస్యలే పునరావృతం


నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశంలో పాత సమస్యలే పునరావృతం అయ్యాయి. సమావేశాల్లో సభ్యులు ప్రస్తావించిన సమస్యలను మినిట్లుగా నమోదు చేయకుండా చేద్దాం అని చెప్పి వదిలివేయటంతో ఈ సమస్య వస్తున్నదని సీపీఐ కార్పొరేటర్‌ బీజే క్టెమెంట్‌ పేర్కొన్నారు. తన డివిజన్‌లో తాగునీటి సమస్య గురించి ఎన్నిమార్లు సమావేశాల్లో చెప్పినా సమస్య పరిష్కారం కాలేదని విమర్శించారు. కాగా తన డివిజన్‌లో కబేళా సమస్య గురించి ఐదేళ్లుగా ప్రతి సమావేశంలో ప్రస్తావించినా ఇంతవరు ఎందుకు పరిష్కారం చేయలేదని టీఆర్‌ఎస్‌ కార్పోరేటర్‌ బిక్కసాని ప్రశాంతలక్ష్మి పేర్కొన్నారు. తన డివిజన్‌లో మోకాళ్లలోతు నీళ్లు నిలుస్తున్న విషయాన్ని మేయర్‌కు స్వయంగా చూపించినా ఎందుకు పటించుకోవటం లేదని సీపీఎం కార్పోరేటర్‌ అఫ్రోజ్‌ సమీనా ప్రశ్నించారు. లకారం చెరువునుంచిమురుగునీరు కొత్తగూడెం చెరువులో కలుస్తున్నదని, ఈ విషయాన్ని పలుమార్లు సమావేశాల్లో చెప్పినా పట్టించుకోవటం లేదని టీడీపీ కార్పొరేటర్‌ చేతుల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ కార్పోరేటర్‌ కమర్తపు మురళి, ఉప మేయర్‌ బత్తుల మురళి నగరంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. సారధినగర్‌ రైల్వే అండర్‌బ్రిడ్జి నిర్మాణం పెండింగ్‌పై కాంగ్రెస్‌ కార్పోరేటర్‌ నాగండ్ల దీపక్‌చౌదరి ప్రస్తావించారు. అలాగే రహదారులు విస్తరించకుండా డివైడర్లు నిర్మిస్తే రహదారులు ఇరుకై ట్రాఫిక్‌ సమస్య వస్తున్నదని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌లీడర్‌, కార్పొరేటర్‌ కర్నాటి కృష్ణ 9 డివిజన్లనుంచి వస్తున్న మురుగునీటి సమస్యను ప్రస్తావించి, ఎల్‌ఆర్‌ఎ్‌సపై వివరణ ఇవ్వాలని కోరారు.

 

సమస్యలను పరిశీలించాలి


సమస్యలను పరిశీలించాలని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి సమావేశంలో కోరారు. 1వ డివిజన్‌ కైకొండాయిగూడెంలో నీటిసమస్యను, దానవాయగూడెంలో రహదారుల పరిస్థితిని ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తెచ్చారు. రహదారుల నిర్మాణంలో వ్యయం ఎక్కువై, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటాన్ని ఎమ్మెల్సీ బాలసాని ప్రస్తావించారు. 


అన్ని సమస్యలను పరిష్కరిస్తాం: కమిషనర్‌


కార్పోరేటర్లు సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన సమస్యలను పరిష్కరిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్‌ పేర్కొన్నారు. సారధినగర్‌ ఆర్‌యూబీకి రహదారి దేవాదాయ శాఖ స్థలంలో ఉందని, ఈ విషయం కోర్టులో ఉందన్నారు. కాగా ప్రస్తుత మాస్టర్‌ప్లాన్‌ వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, ప్రస్తుతం నూతన మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన జరుగుతున్నదన్నారు. అన్ని శాఖల అధికారులతో సమావేశం అయ్యామని, ట్రాఫిక్‌ పరిశీలన క్షేత్రస్థాయిలో జరుగుతున్నదని, త్వరలోనే మాస్టర్‌ప్లాన్‌ ముసాయిదా వస్తుందన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ పెండింగ్‌ దరఖాస్తులు 5వేలు పెండింగ్‌లో ఉండగా ఇప్పటి వరకు 900 పరిష్కారం అయ్యాయన్నారు. మిగతా దరఖాస్తుదారులు గురువారం వరకు పెండింగ్‌ డాక్యుమెంట్లు ఇస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు. ప్రస్తుతం మిషన్‌భగీరధకు పైప్‌లైన్ల కనెక్షన్‌ల పని జరుగుతున్నదని, సంక్రాంతికి ఇంటిటికీ తాగునీరు అందుతాయన్నారు. రోడ్త ప్యాచ్‌వర్క్‌లు. మిషన్‌భగీరఽథపైప్‌లైన్ల లీకేజీలపై దృష్టిపెట్టామన్నారు.


Updated Date - 2020-12-31T05:22:02+05:30 IST