పొలం పనులకు సిద్ధం
ABN , First Publish Date - 2020-05-10T10:33:32+05:30 IST
కరోనా ప్రభావితంలోనే ఈఏడాది ఖరీఫ్ సాగు ఉండబోతుంది. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ శాఖల్లో పనులు స్తబ్ధుగా
![పొలం పనులకు సిద్ధం](https://media.andhrajyothy.com/appimg/galleries/202005100414283/05102020050327n88.jpg)
వానాకాలం పంటకు సమాయత్తమవుతున్న వ్యవసాయశాఖ
దుక్కులు చేస్తున్న రైతన్నలు
ఈ ఏడాది ‘కరోనా’లోనే ఖరీఫ్ సాగు
ఖమ్మం, మే 8 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): కరోనా ప్రభావితంలోనే ఈఏడాది ఖరీఫ్ సాగు ఉండబోతుంది. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ శాఖల్లో పనులు స్తబ్ధుగా ఉన్నా.. వ్యవసాయ అనుబంధ శాఖలు మాత్రమే జూన్ నుంచి ప్రారంభమవుతున్న వ్యవసాయానికి కార్యాచరణ సిద్ధం చేశాయి. రబీ వ్యవసాయ పనులు పూర్తయిన నేపథ్యంలో వచ్చే ఖరీఫ్కు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, రుణాలు అందించేందుకు వ్యవసాయశాఖ కూడా ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది.
జిల్లాలో ప్రస్తుతం కరోనా కేసులు లేకపోయినా ఖరీఫ్ సాగు తరుణంలో వర్షాకాలంలో కరోనా వ్యాప్తి జరిగే ప్రమాదం లేకపోలేదు. రాబోయే ఖరీఫ్కు రైతులు పొలాలను సిద్ధం చేస్తున్నారు. పత్తి, మిర్చి కట్టెలను తొలిగించి వేసవి దుక్కులు దున్నడం ప్రారంభించారు. జిల్లాలో ఖరీఫ్కింద 2లక్షల35వేల951 హెక్టార్లలో పంటలు సాగుచేసేందుకు వ్యవసాయశాఖ కార్యాచరణ రూపొందించింది. ఇందులో వరి 64,746 హెక్టార్లు, పత్తి 95,575 హెక్టార్లు, మొక్క.జొన్న 3,839, పెసర 9768, కంది 2264, వేరుశనగ 121, మిర్చి 22045, చెరకు 3590 హెక్టార్లలో ఖరీఫ్ సాగు కానుంది. ఈ ఏడాది ఖరీఫ్ సాగు ఆశాజనకంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సీజన్లో రైతులు విత్తనాలకు ఇబ్బంది పడకూడదని జిల్లాకు అవసరమైన వరి, పత్తి జీలుగు, పిల్లిపెసర, జనుము తదితర రకాల విత్తనాలు సిద్ధం చేశారు.
ఇందులో పత్తి ఆరు లక్షల 29వేల ప్యాకెట్లు, జీలుగు 13,307 క్వింటాళ్లు, పిల్లిపెసర 2,215 క్వింటాళ్లు, జనుము 900క్వింటాళ్లు వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. జిల్లాలో 82 కేంద్రాల ద్వారా విత్తనాలను విక్రయించనున్నారు. ఈఏడాది ఖరీఫ్కు 2.55లక్షల మెట్రిక్టన్నుల ఎరువులు అవసరముండగా 42,088 మెట్రిక్టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. ఈఏడాది వర్షాలు కురిసి సాగర్నీరుతోపాటు చెరువులు, ప్రాజెక్టులు, బోర్లు, బావులతో పంటలు ఆశాజనకంగా ఉంటాయని రైతాంగం ఆశిస్తోంది.