ఆటోడ్రైవర్లు ఎంతో సహకరించారు

ABN , First Publish Date - 2020-05-09T10:28:03+05:30 IST

కరోనా కష్టకాలంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా, ఇళ్లలో నుంచి బయటకు రాకుండా లాక్‌డౌన్‌కు సహకరించారని,

ఆటోడ్రైవర్లు ఎంతో సహకరించారు

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బయటకు రాలేదు 

గ్రీన్‌జోన్‌లోకి వచ్చాకే ఆటోలకు అనుమతి

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌

పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిత్యావసరాల అందజేత


ఖమ్మంక్రైం, మే8: కరోనా కష్టకాలంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా, ఇళ్లలో నుంచి బయటకు రాకుండా లాక్‌డౌన్‌కు సహకరించారని, కరోనా నేపథ్యంలో ఎక్కువగా నష్టపోయింది ఆటోడ్రైవర్లేనని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఖమ్మంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో 1000మంది ఆటోడ్రైవర్లకు ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నిత్యావసరాలను శుక్రవారం అందజేశారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించి ఎవరినీ బయటకు రావొద్దని సూచించడంతో.. ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతూ రోడ్లపైకి రాకుండా ప్రభుత్వానికి, పోలీసుశాఖకు సహకరించారన్నారు. అలాగే గ్రీన్‌జోన్‌లోకి వచ్చిన తర్వాతే ఆటోలు నడుపుకోవాల్సి ఉంటుందన్నారు.  అయితే బస్సులైనా, ఆటోలైనా లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత గతంలోలాగా తిప్పకూడదని, పాఠశాలల విద్యార్థులను, ప్రయాణికులను కుక్కికుక్కి తీసుకెళ్లడం కుదరదన్నారు. భౌతికదూరం పాటిస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాల్సి ఉంటుందన్నారు. కొంత కష్టం, నష్టమైనప్పటికీ ఇది తప్పదన్న ఆయన.. ప్రయాణీకులపై భారం పడకుండా నడపాల్సి ఉంటుందన్నారు.


ఇక ఆరెంజ్‌జోన్‌లో కూడా వ్యవసాయ పనిముట్లు, ఉత్పత్తులు, నిత్యావసరాల రవాణాకు ఆటోలు ఉపయోగించుకోవచ్చన్నారు. ఆర్టీసీ బస్సులు రోడ్డుపైకి వస్తే ఏం చేయాలో ఆలోచిస్తున్నామని, తీవ్ర నష్టం వాటిల్లినా భౌతికదూరం పాటించకతప్పదన్నారు. తక్కువ మంది ప్రయాణికులతోనే సర్వీసులు నడపాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌ వస్తే.. ఇప్పటి వరకు ఏడుగురు డిశ్చార్జ్‌ అయ్యారని, ఇంకొక్కరు మాత్రమే చికిత్స పొందుతున్నారని వివరించారు.


ఆవ్యక్తి కూడా డిశ్చార్జ్‌ అయితే ఖమ్మం జిల్లా కూడా గ్రీన్‌జోన్‌లోకి వస్తుందని, ఆ తర్వాత కూడా ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనన్నారు. కరోనా కట్టడికి పోలీసులు విషేష కృషిచేస్తున్నారని, ఈ క్రమంలోనే దాతల సహకారంతో పోలీసుశాఖ వారు నిరుపేదలకు సాయం చేయడం అభినందనీయన్నారు. ఈకార్యక్రమంలో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ఏడీసీపీ మురళీధర్‌, ఖమ్మం మేయర్‌ పాపాలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-09T10:28:03+05:30 IST