డబ్బు సంపాదనకు నకిలీ పోలీస్ అవతారమెత్తాడు
ABN , First Publish Date - 2020-11-28T04:39:51+05:30 IST
వాహనదారులను బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ పోలీస్ను కూసుమంచి పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీస్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, రైల్వే ఉద్యోగిగా అక్రమ వసూళ్లు
ఇసుక ట్రాక్టర్లనూ వదలని నిందితుడు
కూసుమంచి, నవంబరు 27: వాహనదారులను బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ పోలీస్ను కూసుమంచి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ కె.సతీష్ కధనం ప్రకారం నిందితుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామానికి చెందిన గుగులోతు అఖిల్ నాయక్ జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. దీనికి ప్రభుత్వ ఉద్యోగం అయితే సులభంగా ఉంటుందని భావించి పోలీస్గా, ఫారెస్ట్ బీట్ అధికారిగా, రైల్వే ఉద్యోగిగా యూనిఫామ్ ధరించి నకిలీ దందా సాగిస్తున్నాడు. ఈక్రమంలో మండలంలోని సంధ్యాతండా వద్ద ఇసుకట్రాక్టర్లనుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఓవ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శుక్రవారం కూసుమంచిలో శివాలయం సమీపంలో నిందింతుడు అఖిల్నాయక్ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇతను నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని కూడ వసూళ్లకు పాల్పడినట్లు తెలిపారు. ఈమేరకు కేసునమోదు చేసి, రిమాండ్కు పంపుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి, పోలీసు సిబ్బంది పలువురు ఉన్నారు.