మంత్రి పువ్వాడకు కరోనా

ABN , First Publish Date - 2020-12-16T04:45:07+05:30 IST

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కరోనా బారిన పడ్డారు. ఖమ్మంలో వరుస కార్యక్రమాలు ముగించుకుని ఆదివారం హైదరాబాదు వెళ్లిన మంత్రి పువ్వాడ.. సోమవారం తనకు పలు కరోనా లక్షణాలు కనిపించడంతో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది

మంత్రి పువ్వాడకు కరోనా

తనతో పాటు కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి సూచనలు

కలెక్టర్‌తోపాటు పలువురు హోంక్వారంటైన్‌కు..

ఖమ్మం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కరోనా బారిన పడ్డారు. ఖమ్మంలో వరుస కార్యక్రమాలు ముగించుకుని ఆదివారం హైదరాబాదు వెళ్లిన మంత్రి పువ్వాడ.. సోమవారం తనకు పలు కరోనా లక్షణాలు కనిపించడంతో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన తన మినిస్టర్‌ క్వార్టర్స్‌లోనే హోంఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మంగళవారం సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. జిల్లాలో జరిగిన పలు కార్యాక్రమాల్లో తనతో పాటు కలిసి పర్యటించిన వారు జాగ్రత్తగా ఉండాలని, ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.  తనకు కరోనా వచ్చిన కారణంగా తనను కలవడానికి ఎవరూ రావద్దని, ఫోన్‌ కూడా చేయవద్దని, తన ఆరోగ్యపరిస్థితిని ఏరోజుకారోజు వెల్లడిస్తానన్నారు. కోలుకున్న తర్వాత యథావిధిగా కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు. అయితే మంత్రి అజయ్‌కు పాజిటివ్‌ వచ్చిన వెంటనే ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌తోపాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మంగళవారం హోంక్వారంటైన్‌ ఉన్నారు. మంత్రి నివాసంలో ఉండే సిబ్బంది, ముఖ్య అనుచరులు పలువురు కొవిడ్‌ పరీక్షలు చేయించుకోగా నెగిటివ్‌ వచ్చింది ఇటీవల జీహెచ్‌ఎంసీ ఎన్నిక ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటించిన మంత్రి అజయ్‌ అనంతరం ఈనెల 7న ఖమ్మంలో ఐటీహబ్‌తో పాటు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌, ఆర్‌అండ్‌బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, హోంమంత్రి మహమూద్‌అలీతో కలిసి పాల్గొన్నారు. ఆతర్వాత ఖమ్మంలో రైతుసంఘాల బంద్‌లో పాల్గొన్నారు. 12న భద్రాద్రి జిల్లాలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి రైతువేదికలు ప్రారంభించారు. ఆదివారం ఖమ్మంలో మంత్రి పువ్వాడ, నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా ఐటీహబ్‌ను సందర్శించి మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కరోనా వచ్చిందన్న విషయంతెలియగానే అందరిలో హైరానా కనిపించింది. ఇటీవల ఆయనను కలిసిన వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఉమ్మడిజిల్లాలో మరో 114మందికి కొవిడ్‌

కొత్తగూడెం కలెక్టరేట్‌ / ఖమ్మం సంక్షేమవిభాగం, డిసెంబర్‌ 15 : ఉమ్మడిజిల్లాలో కొవిడ్‌ వ్యాప్తి కొనసాగుతోంది. మంగళవారం ఇరుజిల్లాల్లో 114మంది కొవిడ్‌ బారిన పడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 2,188 మందికి పరీక్షలు నిర్వహించగా 90 మందికి పాజిటివ్‌ వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లాలో 24 మంది కొవిడ్‌ బారినపడ్డారని రాష్ట్రవైద్యశాఖ రోజువారీ నివేదికలో వెల్లడించింది. 


Updated Date - 2020-12-16T04:45:07+05:30 IST