పత్రికల్లో వస్తేకానీ సమస్యలు తెలియవా ?
ABN , First Publish Date - 2020-07-09T11:22:54+05:30 IST
‘పత్రికల్లో వస్తే తప్ప మీకు సమస్యలు తెలియవా’? అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులపై ఆగ్రహం ..
శ్మశానవాటిక నిర్వహణ అద్వానంగా ఉంది
కార్పొరేషన్ అధికారులపై మంత్రి అజయ్ ఆగ్రహం
నగరంలో సైకిల్పై తిరిగి సమస్యల పరిశీలన
ఖమ్మం కార్పొరేషన్/చర్చి కాంపౌండ్, జూలై 8: ‘పత్రికల్లో వస్తే తప్ప మీకు సమస్యలు తెలియవా’? అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలోని హిందూ శ్మశానవాటిక నిర్వహణ అద్వాన్నంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి; నిర్వహణ కమిటీని మార్చాలని ఆదేశాలు జారీచేశారు. ఖమ్మం కలెక్టర్ ఆర్వీ. కర్ణన్, నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్జయంతితో కలిసి బుధవారం మంత్రి సైకిల్పై ఖమ్మంలో పర్యటించారు. ఉదయం 6గంటలకే ప్రారంభమైన ఈ పర్యటనలో ముందుగా మంత్రి బస్టాండ్ సమీపంలోని వీధివ్యాపారుల సముదాయం ఆధునిక పనులను పరిశీలించారు. అనంతరం కాల్వోడ్డు ప్రాంతంలో మోతీనగర్ వద్ద రహదారి విస్తరణ పనులను తనిఖీచేసిన మంత్రి పువ్వాడ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలను తొలగించకపోవటంపై అధికారులను ప్రఽశ్నించారు. పత్రికల్లో వస్తే తప్ప సమస్య తెలియదా ? అని ప్రశ్నించారు. నెలాఖరులోగా రహదారి విస్తరణ, సెంట్రల్టైటింగ్ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. తరువాత శ్మశాన వాటికను పరిశీలించిన మంత్రి అక్కడ నిర్శహణ తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. నిర్శహణ కమిటీని మార్చాలని కమిషనర్ అనురాగ్ జయంతిని ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ నిధులు రూ.50లక్షలతో శ్మశానవాటికలో ఆధునికీకరణ పనులు చేపట్టి, గ్రీనరీ ఏర్పాటు చేయాలన్నారు. ముఖద్వారం వద్ద రెండు షాపులను తొలగించి విశాలంగా చేయాలని ఆదేశించారు.
త్రీటౌన్ ప్రాంతంలోని బోసుబొమ్మ సెంటర్ రోడ్ విస్తరణ, జంక్షన్ ఏర్పాటు, వ్యవసాయమార్కెట్ వద్ద ఆక్రమణల తొలగింపు పనులను అన్నిశాఖల అధికాకులు సమన్వయంతో చేపట్టాలని సూచించారు. సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఖమ్మం నగరానికి ఇచ్చిన నిధులతో ఎంతో అభివృద్ధి చేయగలిగామని, మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఉపమేయర్ బత్తుల మురళి, పబ్లిక్హెల్త్ ఈఈ రంజిత్కుమార్, నగరపాలక సంస్థ ఏసీపీ సురేష్బాబు, డీఈలు రంగారావు, ధరణీకుమార్, ఆర్్క్షబీ ఈఈ శ్యాంప్రసాద్, విద్యుత్శాఖ డీఈ రాములు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
దేశంలో ఏరాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుసంక్షేమ పథకాలను అమలు చేస్తుందని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. రఘునాధపాలెం మండలంలో బుధవారం మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు చిమ్మపుడిలో రూ.11.64లక్షలతో నిర్మించిన వైకుంఠధామం, రూ.67.65లక్షలతో నిర్మించిన మిషన్ భగీరధ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. కోయచలక రైతువేదికకు చిమ్మపుడిలో శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీకర్ణన్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రైతుసమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చువిజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.