ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌కు భారీస్పందన

ABN , First Publish Date - 2020-12-14T03:58:40+05:30 IST

ఖమ్మం నూతన బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేస్తున్న సమీకృత వెజ్‌ అండ్‌ నాన్‌ వెజ్‌(ఇంటగ్రేటెడ్‌) మార్కెట్‌లో కూరగాయల దుకాణాలు ఏర్పాటుకు భారీ స్పందన లభించింది.

ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌కు భారీస్పందన
రైతులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌

దుకాణాలు పొందేందుకు 253 మంది దరఖాస్తు

64 ప్లాట్‌ఫాంల్లో 128 దుకాణాల సముదాయం

నాలుగైదురోజుల్లో మార్కెట్‌ ప్రారంభం

ఖమ్మం మార్కెట్‌ , డిసెంబరు 13: ఖమ్మం నూతన బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేస్తున్న సమీకృత వెజ్‌ అండ్‌ నాన్‌ వెజ్‌(ఇంటగ్రేటెడ్‌) మార్కెట్‌లో కూరగాయల దుకాణాలు ఏర్పాటుకు భారీ స్పందన లభించింది. జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌రావు, మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం దరఖాస్తులు స్వీకరించారు.  సుమారు 350 మంది రైతులు అక్కడ సౌకర్యాలను పరిశీలించారు. 253 దరఖాస్తులను సమర్పించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌రావు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ నగరానికే తలమా నికంగా ఇంటగ్రేటెడ్‌ మార్కెట్‌ నిలిచిపో నుందన్నారు. భవిష్యత్‌లో ఈ మార్కెట్‌ మరింత అభివృద్ధి చెందుతుం దన్నారు. రైతులు ఇక్కడి మార్కెట్‌లో పరిశుభ్రతను పాటించి, తాజా కూరగాయలను తెచ్చి వినియోగదారులు మన్ననలు పొందాలని అన్నారు. మరో నాలుగైదు రోజుల్లోనే ఇంటగ్రేటెడ్‌ మార్కెట్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, డీఎంవో నాగరాజు, ఈవో శ్వేత, పలువురు రైతులు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ ఇబ్బందుల నేపథ్యంలో

 ఇక్కడి సమీకృత మార్కెట్‌లో కూరగాయలు పండించే రైతులకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మార్కెటింగ్‌ శాఖ అధికారులు పేర్కోంటున్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందుల దృష్ట్యా భక్తరామదాసు కళా క్షేత్రం వద్ద ఉన్న రైతుబజార్‌ను మూసి వేశారు. కూరగాయల రైతులు ఒకింత ఆందోళన చెందినా కొత్త బస్టాండ్‌ ప్రారంభమైతే అక్కడ మున్ముందు వినియోగదారులు తాకిడి లభించవచ్చనే ఆశాభావంతో రైతులు భారీగా తరలి వచ్చారు. భక్తరామదాసు కళాక్షేత్రం వద్ద నాటి రైతు బజార్‌లో సుమారు 400 నుంచి 450 మంది రైతులు కూరగాయలను అమ్ముకోవడానికి వచ్చేవారు. అక్కడి రైతుబజార్‌ను  రవాణా శాఖా మంత్రి కొత్త బస్టాండ్‌ వద్దకు తరలించాలని ఆదేశించారు. సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. పెవీలియన్‌ గ్రౌండ్‌ రైతుబజార్‌లో మూసివేసే సమయం లో ఉన్న 18 స్వయం సహాయక సంఘాలకు చెందిన దుకాణాలను నూతన మార్కెట్‌లో పాతవారికే  కేటాయించారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌లోని కూరగాయలు అమ్ముకోవడానికి ఏర్పాటు చేసిన షెడ్లలో 64 ప్లాట్‌పాంలు ఉన్నాయి. అందులో ఒక్కో ప్లాట్‌ ఫాంలో రెండు దుకాణాలు అంటే మొత్తం 128 కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేసుకునే వీలు కల్పించారు. నాన్‌వెజ్‌ షాపుల కోసం38, ఇతర దుకాణాల కోసం35 షట్టర్లు, 3 పగోడాలలో 24 దుకాణాలు అందుబాటులోకి తెచ్చారు. 

Updated Date - 2020-12-14T03:58:40+05:30 IST