కిష్టాపురం అడవుల్లో ఎన్కౌంటర్ ?
ABN , First Publish Date - 2020-10-30T11:33:26+05:30 IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం కిష్టాపురం అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు ముమ్మరంగా ప్రచారం సాగుతోంది.
ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్లు ప్రచారం
ధ్రువీకరించని పోలీసులు
పినపాక, అక్టోబరు 29: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం కిష్టాపురం అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. మావోయిస్టులకు నిత్యావసరాలు అందించేందుకు కిష్టాపురానికి వచ్చిన ఓ మహిళను పోలీసులు అనుసరించినట్లు సమాచారం. సదరు మహిళ ద్వారా మావోయిస్టులను గుర్తించిన పోలీసులు కాల్పులు జరపగా ఇద్దరు వ్యక్తులు మృతిచెందినట్లు ప్రచారం సాగుతోంది. సాయంత్రం సమయంలో మణుగూరు ఏఎస్పీ శబరీష్, ఏడూళ్లబయ్యారం సీఐ రమేశ్, పోలీసు సిబ్బంది ప్రైవేటు వాహనాల్లో సంఘటనా స్థలానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అధికారిక వాహనాల్లో వచ్చిన వారంతా ప్రైవేటు వాహనాల్లో సంఘటనా స్థలానికి వెళ్లడం పలు అనుమానాలను తావిస్తోంది. సమీప గ్రామాల ప్రజలు పదుల సంఖ్యలో వాహనాలు అటవీప్రాంతం వైపు వెళ్లినట్లు చెబుతున్నారు. ఇటీవల మంగపేట మండటం నర్సింహాసాగర్ అటవీప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందిన ఘటన మరువకముందే మండలంలో కాల్పుల ప్రచారంతో ఆదివాసీ గ్రామాలు భీతిల్లుతున్నాయి. ఈ విషయమై మణుగూరు ఏఎస్పీ శబరీష్ మాట్లాడుతూ కిష్టాపురం అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుగుతోందని, ఎన్కౌంటర్ జరిగిందనేది పూర్తిగా అవాస్తమమన్నారు. ఈ ఎన్కౌంటర్ వస్తున్న వార్తలు అవాస్తవమని జిల్లా ఎస్పీ సునీల్దత్ గురువారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.