ధాన్యాన్ని వెనక్కి పంపారు
ABN , First Publish Date - 2020-12-08T05:25:09+05:30 IST
రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు వెనక్కి తిప్పి పంపారంటూ సోమవారం రైతులు నేలకొండపల్లిలో రాస్తారోకోకు దిగారు.

నేలకొండపల్లిలో రైతుల ఆందోళన
నేలకొండపల్లి, డిసెంబరు7: రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు వెనక్కి తిప్పి పంపారంటూ సోమవారం రైతులు నేలకొండపల్లిలో రాస్తారోకోకు దిగారు. ఇటీవల డీసీఎంఎస్ ధాన్యం కొనుగోలు చేస్తుండటం తెలిసిందే.. ఈనెల3న దాదాపు 8మంది రైతుల నుంచి 870 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు లారీకి లోడు చేసి ఖమ్మం మిల్లులకు పంపారు. అక్కడ మిల్లర్లు ఈ ధాన్యా న్ని దించుకోవటానికి తిరస్కరించారు. లారీ 3వతేదీ నుంచి 7వ తేదీ వరకు వివిధ మిల్లులకు తిరిగినా లారీలోని ధాన్యాన్ని దిగుమతి చేసుకోలేదు. చివరకు లారీకి 40 టిక్కీలు కట్ చేసుకుని దించుకుంటామని వారు చెప్పారు. దీంతో మా పరిస్థితి ఏమిటంటూ రైతులు ఆందోళనకు దిగారు. లారీకి 5రోజుల కిరాయి ఇవ్వాలని లేని పక్షంలో ధాన్యాన్ని దించనీయనని లారీ డ్రైవర్ చెప్పటంతో మరింత ఆందోళనకు గురయ్యారు.
భారీగా ట్రాఫిక్ జామ్
రైతుల ఆందోళనతో ఖమ్మం-కోదాడ రహదారితో పాటు కూసుమంచి రోడ్డులో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎప్పుడూ లేని విధంగా దాదాపు 2గంటల పాటు రాస్తారోకో జరగటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు. పోలీసులంతా మంత్రుల సభకు బందోబస్తుకు వెళ్లటంతో రాస్తారోకో నిరవధికంగా కొనసాగింది. దీంతో తహసీల్దార్ తాళ్లూరి సుమ రైతుల వద్దకు వచ్చి రాస్తారోకో విరమించాలని కోరారు. ధాన్యాన్ని కొనుగోలు చేశాక రైతులకు సంబంధం లేదని, అధికారులు చూసుకుంటారని నచ్చజెప్పటంతో ఆందోళనను విరమించారు. ఈ ఆందోళన లో పిట్టల వెంకన్న, లింగం ఉపేందర్, బాజా రామకృష్ణ, కాసాని లింగయ్య, పగిడికత్తుల రాము, చెరుకు సీతారాము లు, అడపాల శ్రీను, రాజపుత్ర రాజాసింగ్ పాల్గొన్నారు.