కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-03-25T11:32:32+05:30 IST

లాక్‌డౌన్‌లో భాగంగా రెండవ రోజు మంగళవారం ఉమ్మడి జిల్లాలో బంద్‌ కట్టుదిట్టంగా సాగింది.

కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

 స్వీయ నియంత్రణ పాటించిన ప్రజలు

అత్యవసరాలు మినహా అన్నీ బంద్‌

స్వయంగా పర్యవేక్షించిన ఉన్నతాధికారులు


ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌: లాక్‌డౌన్‌లో భాగంగా రెండవ రోజు మంగళవారం ఉమ్మడి జిల్లాలో బంద్‌ కట్టుదిట్టంగా సాగింది. ఉదయం 10గంటల వరకే నిత్యవసరాల కొనుగోళ్లకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో ప్రజలు ఆ తర్వాత ఇళ్లకే పరిమితమయ్యారు. రోడ్లపైకి వచ్చిన వారి కారణాలు తెలుసుకుని పోలీసులు సామాజిక బాధ్యతగా ప్రతిఒక్కరూ సహకరించాలని వేడుకున్నారు. సత్తుపలిలోఓ ప్రస్తుతం ఉన్న కూరగాయాల మార్కెట్‌, రైతుబజార్‌ ఇరుకుగా ఉండటంతో అధికారులు బస్టాండ్‌లో విక్రయాలను ఏర్పాటుచేశారు. మీటర్‌ దూరంలో ఉండేలా చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజలు అవేమీ పాటించకపోవడం విశేషం.


కరోనాపై అధికారులు అప్రమత్తం

ఆంధ్రప్రదేశ్‌లోని చింతలపూడి మండలం రాఘవపురం లో ఓ శుభకార్యం విషయంపై సత్తుపల్లి పరిసర ప్రాం తాల ప్రజలు వెళ్లడంతో రెవెన్యూ, మునిసిపల్‌, వైద్యారోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో ఏఏ కుటుంబాల వారు ఎవరెవరు వెళ్లారనే విషయంపై వివరాలు సేకరించారు. ఇతర రాష్ర్టాలు, దేశాల నుంచి వచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచితే కఠిన చర్యలు తప్పవని అధికారులు తెలిపారు. మునిసిపాలిటీలో చైర్మన్‌ కూసంపూడి మహేష్‌ అన్నివార్డులు తిరుగుతూ ఇంటినుంచి బయటకు రావద్దని తెలియజేస్తూ వీధులవెంట బ్లీచింగ్‌ చల్లిస్తున్నారు.


కఠిన చర్యలు తీసుకుంటాం: ఏఎస్పీ

ప్రజలు కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ బంద్‌ను పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాచలం ఏఎస్పీ రాజేష్‌ చంద్ర అన్నారు. పట్టణంలోని అంబేద్కర్‌ సెంటర్‌లో మంగళవారం ఆయన లాక్‌డౌన్‌ బంద్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనాలపై రోడ్లపై వచ్చిన వారికి కరోనా వైరస్‌ వలన కలిగే నష్టాన్ని వివరించి అనవసరంగా బయటకు రావద్దని వారికి అవగాహన కల్పించారు. ఎటువంటి పనులు లేకుండా రోడ్లపై వాహనాలతో తిరిగితే వాహనాలను సీజ్‌ చేసి వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ వినోద్‌, పట్టణ ఎస్‌ఐ నరేష్‌ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలో లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా  సోమవారం రాత్రి ఏడు గంటల తర్వాత వాహనాలతో రోడ్లమీదకు వచ్చిన వారి వాహనాలను పోలీసులు సీజ్‌ చేశారు. ఇందులో  రెండు కార్లు, నాలుగు ఆటోలు, 15 బైకులను పోలీసులు సీజ్‌ చేసి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు.


కరోనా వైరస్‌ నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన లాక్‌డౌన్‌ గిరిజన పల్లెల్లో సంపూర్ణంగా అమల వుతోంది. లాక్‌డౌన్‌తో పల్లెల్లో నిర్మానుష్య వాతావరణం నెలకొంది. పల్లెల్లో దుకాణాలు, హోటల్స్‌ పూర్తిగా మూతపడ్డా యి. వేదాంతపురంలో  ప్రత్యేకంగా చేతులు పరిశుభ్రం చే సుకుని అడుగు పెట్టేలా చెక్‌పోస్టు ఏర్పాటు చేసి రసాయనాలు, నీటిని అందుబాటులో ఉంచారు. పలు గ్రామాల్లో ఇంటింటి సర్వే చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో వివాహాలను వాయిదా వేసుకుంటున్నారు. 


ప్రజల్లో ఆందోళనలు

 సీఎం కేసీఆర్‌ ఆదేశానుసారం వైరా మండలంలో లాక్‌డౌన్‌కు రెండోరోజు మంగళవారం ప్రజల నుంచి మద్దతు లభించింది. దాదాపు 80శాతం మంది జనం ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌ మొదటిరోజు సోమవారం ప్రజల మద్దతు అంతంతమాత్రంగానే కన్పించింది. అయితే ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ జారీచేసిన హెచ్చరికలతో సోమవారం రాత్రి 7గంటల నుంచి పోలీసులు కఠినంగా వ్యవహరించారు. వాహనచోదకులను అక్కడికక్కడ నిర్బంధించారు. అంతేకాకుండా కొత్తగూడెం ఓ అధికారి కుమారుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో వారికి బంధువులు, మిత్రులున్న తల్లాడ, వైరా మండలాల్లోని పలు గ్రామాల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. 


మధిర పట్టణంలో రెండోరోజు లాక్‌డౌన్‌ను పోలీస్‌, రెవెన్యూ, వైద్యఆరోగ్యశాఖ, మునిసిపల్‌ అధికారులు పర్యవేక్షించారు. మొదటిరోజు లాక్‌డౌన్‌ను విస్మరించిన ప్రజ లు రోడ్ల వెంట తిరిగి నిత్యావసరాల కొనుగోలుకు గుంపులుగుంపులుగా చేరటంతో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. రైతుబజారు, కూరగాయల మార్కెట్‌కు వచ్చే కొనుగోలుదారులకు బయట డెటాల్‌ కలిపి నీటిని ఏర్పాటుచేసి చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతనే కూరగాయలు కొనుగోలు చేయాలని సూచించారు.

Read more