లారీలో మద్యం బాటిళ్లు.. ఏపీకి అక్రమ రవాణా.. పట్టుబడిన వ్యక్తికి కరోనా..!
ABN , First Publish Date - 2020-07-22T20:15:40+05:30 IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగూడెం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులకు పాజిటివ్ వచ్చింది. దాంతో జడ్పీ చైర్మన్ కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా
![లారీలో మద్యం బాటిళ్లు.. ఏపీకి అక్రమ రవాణా.. పట్టుబడిన వ్యక్తికి కరోనా..!](https://media.andhrajyothy.com/appimg/galleries/2020072202430366/07222020144429n68.jpg)
భద్రాద్రి జిల్లాలో 12 పాజిటివ్ కేసులు
కొత్తగూడెం/అశ్వారావుపేట/భద్రాచలం(ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగూడెం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులకు పాజిటివ్ వచ్చింది. దాంతో జడ్పీ చైర్మన్ కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ రిపోర్టు వచ్చింది. మణుగూరు మండలంలోని సుందరయ్యనగర్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు మణుగూరు వైద్యాధికారులు నిర్ధారించారు. చుంచుపల్లి మండలంలోని వెంకటేష్ఖని పంచాయతీ కార్యదర్శికి కరోనా వచ్చినట్టు సమాచారం. అశ్వారావుపేట నియోజకవర్గంలో మంగళవారం రెండు కరోన పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అశ్వారావుపేటలో ఓ లారీ డ్రైవర్కు, దమ్మపేటలో ఓ వ్యాపారికి పాజిటివ్ వచ్చింది. అశ్వారావుపేటలో పాజిటివ్ వచ్చిన లారీ డ్రైవర్, అతడి కుటుంబం పట్టణంలోని వివిధ వర్గాలతో విస్తృతంగా కాంటాక్టులు కలిగి ఉన్నట్టు సమాచారం. సదరు లారీ డ్రైవర్ ఇటీవలే లారీలో మద్యం బాటిళ్లు ఏపీకి తరలిస్తూ టాస్క్పోర్స్కు పట్టుబడ్డాడు.
అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని జైలుకు పంపే సమయంలో చేసిన కోరోనా పరీక్షల్లో అతడికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇతడితో ప్రాథమిక కాంట్రాక్ట్ కలిగిన 20 మందిని కోరంటైన్ చేశారు. దమ్మపేటలో పాజిటివ్ వచ్చిన వ్యక్తికి అతడి భార్యకు పాజిటివ్ వచ్చినప్పటి నుండే హోమ్ క్వారంటైన్లోనే ఉండిపోయాడు. ఇటీవలే అతడి భార్య పాజిటివ్తో మృతిచెందిన విషయం విధితమే. అతడిని వైద్యాధికారులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భద్రాచలంలో మంగళవారం మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. పట్టణానికి చెందిన అధికార పార్టీ నాయకుడి కుమారుడికి పాజిటివ్ లక్షణాలు ఉండటంతో స్వయంగా వెళ్లి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దాంతో హోం ఐసోలేషన్లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇల్లెందులో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందీరానగర్ ప్రాంతానికి చెందిన ఓ వృద్దురాలికి పాజిటివ్ రావడంతో ఆమను కొత్తగూడెం ఐసోలేషన్కు తరలించారు. 22వ వార్డులో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు మునిసిపల్ అధికారులు ప్రకటించారు. మండల పరిధిలోని బోయితండాకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో ఐసోలేషన్కు తరలిచారు.