అన్నపూర్ణ కేంద్రాల మూసివేత
ABN , First Publish Date - 2020-03-29T11:40:43+05:30 IST
అన్నపూర్ణ కేంద్రాలు పేదవాడికి రూ. ఐదు రూపాయలకే ఆకలి తీరుస్తున్నాయి. అయితే ఆహార పదార్థాల రవాణాకు సమస్య ఏర్పడంతో, ఖమ్మం నగరంలో మూడు
లాక్డౌన్ నేపథ్యంలో ఐదు రూపాయల భోజనానికి గండి
రవాణా సౌకర్యం లేకపోవడంతో నిర్ణయం
ఇబ్బందులు తప్పని గ్రానైట్ వర్కర్లు, వలస కూలీలు
ప్రత్యామ్నాయం చూడాలంటున్న పేదలు
ఖమ్మం కార్పొరేషన్, మార్చి 28: అన్నపూర్ణ కేంద్రాలు పేదవాడికి రూ. ఐదు రూపాయలకే ఆకలి తీరుస్తున్నాయి. అయితే ఆహార పదార్థాల రవాణాకు సమస్య ఏర్పడంతో, ఖమ్మం నగరంలో మూడు కేంద్రాలను మూసేశారు. ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో ఎంతో మంది గ్రానైట్ వర్కర్లు, వలస కూలీలు నగరంలో చిక్కుకుపోయారు. వారంతా ఆకలితో అలమటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అన్నపూర్ణ కేంద్రాలను నిర్వహిస్తే ఎందరో అభాగ్యుల ఆకలి తీరుతుంది. లాక్డౌన్ నేపథ్యంలో మార్కెట్లో నిత్యావసర వస్తువులు లభించడం కష్టమవుతోంది.
రోజుకు 900మందికి
ఖమ్మంలో ఏర్పాటుచేసిన మూడు అన్నపూర్ణ కేంద్రాల ద్వారా రోజుకు 900 మందికి ఆకలి తీరుస్తున్నారు. కేవలం రూ. ఐదుకే కడుపునిండా భోజనం పెడుతున్నారు. నగరంలో గాంధీచౌక్, పెవిలియన్ గ్రౌండ్, తెలంగాణాతల్లి విగ్రహాల వద్ద ఈ భోజనకేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్నంతో పాటు పప్పు, కూర, సాంబారు తదితర ఆహార పదార్థాలను అందచేసేవారు. హైదరాబాద్లోని హరేకృష్ణ సంస్థ ఆధ్వర్యంలొ అక్షయపాత్ర పథకం కింద భోజనాన్ని అందిస్తుండగా, దీనికయ్యే ఖర్చును నగరపాలక సంస్థ భరిస్తోంది. పేదలకు ఆహారాన్ని అందించేందుకు నగరపాలక సంస్థ నెలకు రూ.5.40 లక్షల వరకు ఖర్చుచేస్తోంది.
రవాణా సౌకర్యం సమస్యతోనే
రవాణా సౌకర్యం సమస్యతోనే నగరంలోని మూడు కేంద్రాలను మూసేశారు. ఖమ్మం నగరంలోని కేంద్రాలకు ఆహారాన్ని ప్రతిరోజు కొత్తగూడెంలో తయారుచేసి, వారి సొంత వాహనాల ద్వారా ఖమ్మం పంపిస్తుంటారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ నిబంధనల ప్రకారం రవాణాపై ఆంక్షలు ఉండటంతో ఆహార పదార్థాలను తేలేకపోతున్నారు. అంతేకాకుండా ఐదు రూపాయల భోజన కేంద్రం వద్ద జనసమ్మర్ధం ఎక్కువగా ఉంటుందనేది కేంద్రాల మూసివేతకు మరో కారణంగా చెపుతున్నారు. ముగ్గుతో వృత్తాలు గీసి దూరంగా నించోపెట్టి ఆహారం అందిచ్చవచ్చనే అభిప్రాయాలను పేదలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుత పరిస్థితుల్లో పేదల ఆకలి తీర్చేందుకు కేంద్రాలు తెరవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో అన్నపూర్ణ కేంద్రాల ద్వారా పేదలకు ఆహారాన్ని అందిస్తున్నారు. ఖమ్మం నగరంలో రూడా కేంద్రాలను నిర్వహిస్తే పేదల ఆకలి తీరుతుంది. లాక్డౌన్ నేపథ్యంలో రవాణాకు అనుమతి లేకపోవటంతో భోజన కేంద్రాలకు ఆహారాన్ని సరఫరా చేయలేక పోతున్నారు.