ఊపందుకుంటున్న వ్యాపారాలు
ABN , First Publish Date - 2020-08-12T10:04:56+05:30 IST
ఖమ్మం జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్లో మొన్నటి వరకు స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించిన బంగారు, కిరాణా జాగీర్ వర్తకులు తిరిగి యథావిధిగా దుకాణాలను

- తెరుచుకున్న గాంధీ చౌక్ దుకాణాలు
- క్రయ వ్రియాలకు మాస్కులు తప్పనిసరి
- నెమ్మదిగా రూపందుకుంటున్న వ్యాపారాలు
ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 11: ఖమ్మం జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్లో మొన్నటి వరకు స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించిన బంగారు, కిరాణా జాగీర్ వర్తకులు తిరిగి యథావిధిగా దుకాణాలను తెరిచారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాపారాలు చేస్తున్నట్లు వ్యాపార సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. దీంతో గాంధీచౌక్ ప్రాంతంలో వ్యాపార కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. కిరాణ, బంగారు వ్యాపారులు సుమారు 15 రోజుల వరకు లాక్డౌన్ పాటించారు. గత నెల19వ తేదీనుంచి ఈనెల9 వరకు దుకాణాలు బంద్ చేశారు. వ్యాపార సంఘాల నాయకులు చర్చించుకుని దుకాణాలలో భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు, శానిటైజర్లతో కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ వ్యాపారాలు చేయాలని తీర్మాణించుకున్నారు. దీంతో వ్యాపారాలు ప్రారంభించారు.
పనిలోకి సుమారు 3000 మంది కార్మికులు
జిల్లా మొత్తానికి వ్యాపార హబ్గా ఉన్న ఖమ్మం గాంధీచౌక్లో వ్యాపారులు లాక్డౌన్ను విరమించి వ్యాపారాలు ప్రారంభించడంతో సందడి కనబడుతోంది. లాక్డౌన్కు ముందు రోజుకు సుమారు 10 నుంచి 15 కోట్ల వ్యాపారం జరిగే ఈ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే కొనుగోళ్ల జోరు మొదలైంది. అన్ని రకాల వ్యాపారుల మాస్కులు ధరించి క్రయ విక్రయాలు చేస్తున్నారు. సుమారు 1500 దుకాణాలు ఉండే గాంధీ చౌక్ జిల్లాకు వాణిజ్య గుండెకాయ లాంటిది. ఇక్కడ కిరాణ, జాగీరు. బంగారు దుకాణాలలో సుమారు 3000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. లాక్డౌన్లో ఎలాంటి ఆరోగ్యసమస్యలు తలెత్తకుండా వారందరు కరోనా ఆంక్షలను పాటిస్తున్నారు. ఖమ్మం, భద్రాచలం జిల్లాలోని రిటైల్ వ్యాపారులకు సరుకులు సరఫరా చేసే ప్రధాన దుకాణాలు తెరుచుకోవడంతో పల్లె వ్యాపారులు కకొనుగోళ్లకు వస్తున్నారు. రెండు మూడు నెలకు సరిపడా సరుకులు కొనుగోలు చేసి తీసుకెళుతున్నారు. రవాణా ఆంక్షలు తొలగడంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి ఆహార పదార్థాల లారీలు వస్తున్నాయి.
నిబంధనలకు అనుగుణంగా..
లాక్డౌన్ నిబందనలు పాటిస్తూ వ్యాపారులు కరోనాను కట్టడి చచేయడానికి ప్రయత్నిస్తున్నారు. దుకాణాలలోకి వచ్చే ప్రతీ ఒక్కరు మాస్కులు ధరించాలని చెబుతున్నారు. చేతులను క్రిమినాశక ద్రావకాలతో శుభ్రం చేసుకున్నాకే వ్యాపారం గురించి మాట్లాడుతున్నారు. కరెన్సీ నోట్లను సైతం ప్రత్యేక పరికరాలతో శానిటైజ్ చేస్తున్నారు. దుకాణాల బయట ప్రత్యేకంగా బారికేడ్ల లాంటి నిర్మాణాలు, తాళ్లను ఏర్పాటు చేశారు.