సీబీఐ విచారణకు సిద్ధమేనా?.. ఫారెస్టు అధికారులకు పినపాక ఎమ్మెల్యే రేగా సవాల్
ABN , First Publish Date - 2020-12-18T04:48:56+05:30 IST
ఆదివాసీ సమస్యలను పరిష్కారిస్తానన్న సీఎం హామీ మేరకు తాను టీఆర్ఎస్లో చేరానని స్పష్టం చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు గ్రామాల్లోకి అటవీ అధికారులు వస్తే నిర్బంధించాలని ఆదివాసీలకు తన సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చి సంచలనం రేపిన విషయం తెలిసిందే.

తప్పుచేస్తే కేసులు పెట్టండి.. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానంటూ పోస్టు
సోషల్మీడియా వేదికగా మరోమారు సంచలన వ్యాఖ్యలు
మణుగూరురూరల్, డిసెంబరు 17 : ఆదివాసీ సమస్యలను పరిష్కారిస్తానన్న సీఎం హామీ మేరకు తాను టీఆర్ఎస్లో చేరానని స్పష్టం చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు గ్రామాల్లోకి అటవీ అధికారులు వస్తే నిర్బంధించాలని ఆదివాసీలకు తన సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చి సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే.. గురువారం కూడా ఆయన తన పంథాను వదల కుండా మరోమారు ఫారెస్టు అధికారులపై ఘాటైన వ్యాఖ్యల చేశారు. కొందరు ఫారెస్టు అధికారుల తప్పిదం వల్ల ప్రభుత్వ భూములు వారి స్వాధీనంలో ఉన్నాయని.. జాయింట్ సర్వే చేస్తే నిజానిజాలు తెలుస్తాయన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు తప్పనుకుంటే ఫారెస్టు అధికారులు తనపై కేసులు పెట్టాలని సవాల్ విసిరారు. అటవీ శాఖ కబ్జాలో వేలాది ఎకరాల భూములు ఉన్నాయని.. సర్వేల ద్వారా ఇవి తేటతెల్లం కానున్నాయన్నారు. ప్రభుత్వ భూములను బలవంతంగా లాక్కుంటే చూస్తూ ఊరుకోమని దమ్ముంటే సర్వేకు సిద్ధం కావాలన్నారు. తాను పార్టీకి విధేయుడనని ప్రజలకు, పార్టీకి నష్టం జరిగితే సహించే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అటవీ శాఖ కబ్జాలో వేలాది ఎకరాల భూమి ఉందని ఆదివాసీ గ్రామాలకు నేటికి రహదారుల సౌకర్యం లేకపోవడానికి ఆ శాఖ అధికారులే కారణమని రేగా మండిపడ్డారు. నియోజకవర్గంలో అటవీ అధికారులు గిరిజనులపై దాడులకు పాల్పడుతున్నారని, తాను స్వయంగా చెప్పినా మాట వినకపోవడం దారుణమన్నారు. అయితే ఎమ్మెల్యే రేగా కాంతారావు తీరుపై జిల్లా అటవీ అధికారులు బుధవారం అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఫిర్యాదు చేసి, తాము గ్రామాల్లో స్వేచ్ఛగా విధులు నిర్వహించలేమని, రేగా తీరు సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫారెస్టుఅధికారులు మంత్రిని కలసిన కొన్ని గంటల్లోనే మరో మారు ఎమ్మెల్యే రేగా సోషల్మీడియా ద్వారా అటవీ శాఖ అధికారులకు సవాల్ విసురుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ‘మా భూములు బలవంతంగా గుంజుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా? మీరు ప్రభుత్వంలో భాగస్వాములు కారా..? మీకు ఎవరిచ్చిన పట్టాలు చెల్లుతాయి? అటవీశాఖ అధికారులు నిజాయితీ పరులైతే.. సీబీఐ విచారణకు సిద్ధమా? మీ కబ్జాలో భూములు ఉంటే శిక్షకు అంగీకరిస్తారా?’ అని ఘాటుగా ప్రశ్నించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ‘ఫారెస్టు వర్సెస్ ఎమ్మెల్యే’గా సాగుతున్న ఈ వివాదాలు ఎంతదూరం వెళతాయో, సీఎం కేసీఆర్ ఈ అంశంపై ఎలా స్పందిస్తారో, ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలకు ఉద్యోగ సంఘాలు ఎలా సమాధానమిస్తాయోనన్న విషయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.