భద్రాద్రి జిల్లాలో మరో రక్తశుద్ధి కేంద్రం
ABN , First Publish Date - 2020-09-18T05:42:03+05:30 IST
కిడ్నీసంబంధ వ్యాధి బాధితులకోసం ప్రభుత్వం భద్రాద్రి జిల్లాలో మరో రక్తశుద్ధి (డయాలసిస్) కేంద్రాన్ని మంజూరు చేసింది. ఇప్పటికే కొత్తగూడెం ఏరియా ఆసుపత్రి, భద్రాచలం ఏరియా ఆసుపత్రుల్లో ఐదు పడకలతో
పాల్వంచ కమ్యూనిటీ ఆసుపత్రికి డయాలసిస్ సెంటర్ మంజూరు
21నుంచి ప్రారంభం కానున్న పనులు
కొత్తగూడెం కలెక్టరేట్, సెప్టెంబర్ 17: కిడ్నీసంబంధ వ్యాధి బాధితులకోసం ప్రభుత్వం భద్రాద్రి జిల్లాలో మరో రక్తశుద్ధి (డయాలసిస్) కేంద్రాన్ని మంజూరు చేసింది. ఇప్పటికే కొత్తగూడెం ఏరియా ఆసుపత్రి, భద్రాచలం ఏరియా ఆసుపత్రుల్లో ఐదు పడకలతో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రక్తశుద్ధి చేస్తున్నారు. రోజుకు 25మంది చొప్పున ఐదు షిఫ్టులలో రోగులకు సేవలు అందించినా జిల్లాలో ఇంకా కిడ్నీ బాధితులు పెరుగుతున్నారు. ప్రస్తుతం కొత్తగూడెం డయాల్సిస్ కేంద్రంలో 65 మంది, భద్రాచలం డయాల్సిస్ కేంద్రంలో 52మంది చికిత్స పొందుతున్నారు. వీరు కాకుండా భద్రాచలంలో 62మంది, కొత్తగూడెంలో 75మంది ఆన్లైన్లో పేరు నమోదు చేసుకొని వెయింటింగ్లో ఉన్నారు.
దీంతో రోగుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పాల్వంచ కమ్యూనిటీ ఆసుపత్రిలో మరో డయాల్సిస్ కేంద్రాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. 21వ తేదీ నుంచి ఈ డయాలసిస్ కేంద్రం పనులు ప్రారంభం కానున్నాయి. మరో రెండు నెలల్లో పనులు పూర్తిచేసి వినియోగంలోకి రానుందని భద్రాద్రి జిల్లా వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రుల అధికారి ముక్కంఠేశ్వరరావు తెలిపారు. దీంతో పాటు భద్రాచలం డయాల్సిస్ కేంద్రంలో కొత్తగా మరో ఐదు పడకలను పెంచి పదిపడకలుగా అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు.