బూజు పట్టిన ఏసీ మిర్చీ
ABN , First Publish Date - 2020-06-22T10:28:32+05:30 IST
రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ఎండుమిరప సరైన ధర రాక కోల్డ్స్టోరేజీలలో నిల్వ చేస్తే ఆ పంట బూజు పట్టి దర్శనమివ్వడంతో
![బూజు పట్టిన ఏసీ మిర్చీ](https://media.andhrajyothy.com/appimg/galleries/20200622041200/06222020045819n77.jpg)
ఖమ్మం మార్కెట్, జూన్ 21: రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ఎండుమిరప సరైన ధర రాక కోల్డ్స్టోరేజీలలో నిల్వ చేస్తే ఆ పంట బూజు పట్టి దర్శనమివ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కరోనా లాక్డౌన్ కాలంలో వ్యవసాయ మార్కెట్లు మూత పడటంతో చేతికొచ్చిన పంట కోల్డ్స్టోరేజీలలో నిల్వ చేసిన రైతులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇటీవల కొంత కాలంగా జిల్లాలోని పలు కోల్డ్ స్టోరేజీలలో అటువంటి సంఘటనలు ఎదురవగా జిల్లా కలెక్టర్ ఆర్ వి. కర్ణన్ కల్పించుకొని రంగు మారిన, బూజు పట్టిన, గర్బాలు పోయిన పంటను కోల్డ్స్టోరేజీ యజమానులే కొనుగోలు చేయాలని ఆదేశించారు. దీంతో కొంత మంది శీతల గిడ్డంగుల యజమానులు కొనుగోలు చేస్తున్నప్పటికీ, మరికొంత మంది యజమానులు కొనుగోలుకు ముందుకు రావడం లేదు. అయితే తాజాగా ఏన్కూరుకు చెందిన ఓ రైతు నగరంలోని ఓ కోల్డ్స్టోరేజీలో గత రెండు నెలల క్రితం తన 60 బస్తాల మిర్చీ పంటను నగరంలోని ఓ కోల్డ్స్టోరేజీలో నిల్వ చేశాడు.
ప్రస్తుతం పెట్టుబడుల సీజన్ ప్రారంభం కావడంతో సరైన ధర వస్తే అమ్మకం చేయడానికి సిద్దపడి తన పంట ను పరిశీలించడానికి ఆదివారం కోల్డ్ స్టోరేజీకి వచ్చాడు. తీరా తన బస్తాలలో పంట నాణ్యత చూసి బిత్తరపోయాడు. తన పంట మొత్తం బూజు పట్టి నాణ్యత చెడి పోవడంతో లబోదిబోమన్నాడు. దీంతో కోల్డ్స్టోరేజీ యజమాన్యాన్ని నిలదీశాడు. వారు సరైన సమాధానం చెప్పక పోవడంతో ఆవేదనన చెంది తన మిర్చీ బస్తాలన్నింటిలోని పంటను మరలా ఆరబెట్టే ప్రయత్నం చేశాడు. నాణ్యత కోల్పోయిన తన పంటకు సగం ధర కూడా దక్కుతుందో లేదోనని కన్నీటి పర్వంతంతో ఇంటికి తిరిగి పయనమయ్యాడు. నాలాంటి ఎంతో మంది రైతులను, అధికారులు తక్షణమే స్పందించి ఆదుకోవాలని వేడుకున్నాడు.