సింగరేణి భూనిర్వాసితుల సమస్యలను పరిష్కారిస్తాం
ABN , First Publish Date - 2020-07-10T11:04:45+05:30 IST
సింగరేణి విస్తరణ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కారిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
మంథనిరూరల్/మంథని, జూలై 9: సింగరేణి విస్తరణ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కారిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మండలంలోని బిట్టుపల్లి గ్రామపంచాయతీ శివారులో రచ్చపల్లి సింగరేణి భూనిర్వాసితుల ఆర్అండ్ఆర్ కాలనీలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హరితహారంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధుతో కలిసి మంత్రి గురువారం పాల్గొన్నారు. అలాగే మంథని పట్టణంలోని ఆర్యవైశ్య కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన అనంతరం స్థానిక పోచమ్మవాడలో హరితహారంలో గురువారం మొక్కలు నాటారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండ్లు, భూములు కోల్పోయిన ప్రజల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కారిస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం హరితహారం కార్యక్రమాన్ని ప్రజలంతా మహాయజ్ఞంగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు. జడ్పీ చైర్మన్ పుట్ట మధు మాట్లాడుతూ.. ప్రభుత్వ చేపటిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ, ఎంపీపీ కొండ శంకర్, జడ్పిటీసీ తగరం సుమలత, శంకర్లాల్, అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మండలంలోని ఎక్లాస్పూర్లో హరితహారంలో భాగంగా మంథని ఆర్డీవో కృష్ణవేణి మొక్కలు నాటారు.