పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో నిండాలి
ABN , First Publish Date - 2020-06-26T10:33:47+05:30 IST
పట్టణాలు, గ్రామాలన్నీ పచ్చదనంతో నిండేలా విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల
![పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో నిండాలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ టౌన్, జూన్ 25: పట్టణాలు, గ్రామాలన్నీ పచ్చదనంతో నిండేలా విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం ఆయన కరీంనగర్లోని ఆర్టీసీ జోనల్ వర్క్షాపులో మొక్కలు నాటి ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఈ విడత 55 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. కరీంనగర్లో 14.5 కిలోమీటర్ల ఆర్అండ్బీ ప్రధాన రహదారులకు ఇరువైపులా 10 లక్షల మొక్కలు నాటుతామని చెప్పారు.
మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో తిమ్మాపూర్, రుక్మాపూర్లో లాంగ్ స్పేస్ అడవులు, సదాశివపల్లిలో మియావాకీ చిట్టడవి పెంచుతామని చెప్పారు. చొప్పదండి, జమ్మికుంట, మానకొండూర్, కొత్తపల్లి మున్సిపాలిటీల్లో విస్తారంగా మొక్కలు నాటుతామని చెప్పారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ కె శశాంక, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మేయర్ వై.సునీల్రావు మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణిహరిశంకర్ పాల్గొన్నారు.