విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-03-13T12:04:03+05:30 IST

విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) జిల్లా కన్వినర్‌ చిక్కుల కిరణ్‌ అన్నారు.

విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం

ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ చిక్కుల కిరణ్‌

సీఎం దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్న పోలీసులు 

తెలంగాణ చౌక్‌లో ఉద్రిక్తత


గణేశ్‌నగర్‌, మార్చి 12: విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) జిల్లా కన్వినర్‌ చిక్కుల కిరణ్‌ అన్నారు. గురువారం తెలంగాణ చౌక్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ మేరకు కార్యకర్తలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.  ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ చిక్కుల కిరణ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికే అతి తక్కువ నిధులు కేటాయించారని చెప్పారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడించేందుకు వెళ్లిన కార్యకర్తలను ప్రభుత్వం పోలీసుల చేత కొట్టించిందని చెప్పారు. విద్యార్థులను రక్తం కారే విధంగా పోలీసులు లాఠీలతో కొట్టారని అన్నారు.


గాయాలైన విద్యార్థులను వదలకుండా తప్పుడు కేసులు బనాయించారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో సవరణలు చేసి విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని కోరారు. లేని ఎడల రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం, పోలీసుల వైఖరికి నిరసనగా శుక్రవారం విద్యాసంస్థల బంద్‌కి పిలుపునిచ్చామని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి నైతం మహేశ్‌, జోనల్‌ ఇంచార్జి సుమంత్‌, రాకేశ్‌, సాయికిరణ్‌, వేణు, ప్రభాష్‌, అన్వేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-13T12:04:03+05:30 IST