నిర్భందం.. స్వచ్ఛందం

ABN , First Publish Date - 2020-03-23T10:57:38+05:30 IST

జనతా కర్ఫ్యూ జగిత్యాల జిల్లాలో విజయ వంతమైంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రధాన మంత్రి మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు.

నిర్భందం.. స్వచ్ఛందం

జిల్లాలో జనతా కర్ఫ్యూ విజయవంతం

స్వచ్ఛందంగా బంద్‌ పాటించిన ప్రజలు

వ్యాపార, వాణిజ్య సంస్థల మూసివేత

క్యాంప్‌ ఆఫీస్‌కే పరిమితమైన మంత్రి ఈశ్వర్‌

సెల్ఫ్‌ క్వారంటైన్‌ ప్రకటించుకున్న కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యేలు


ఆంధ్రజ్యోతి, జగిత్యాల: జనతా కర్ఫ్యూ జగిత్యాల జిల్లాలో విజయ వంతమైంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రధాన మంత్రి మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు మూసివేసి, కరోనా వ్యాధి అంతం కావాలంటూ సాయంత్రం చప్పట్లు కొట్టారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ క్యాంప్‌ ఆఫీస్‌కే పరిమితం కాగా, జిల్లా కలెక్టర్‌ జి.రవి, ఎస్పీ సింధు శర్మతో పాటు జడ్పీ చైర్‌ పర్సన్‌ దావ వసంత, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్‌ కుమార్‌, విద్యాసాగర్‌ రావు, బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణిలు ఇంట్లోనే ఉండిపోయారు. అలాగే మెట్‌పల్లిలో కర్ఫ్యూ దృష్ట్యా అంత్యక్రియలు వాయిదా పడగా, పలు చోట్ల వివాహ రిసెన్షన్‌ వేడుకలు వాయిదా వేసుకున్నారు. మెట్‌పల్లిలో కరోనా వైరస్‌ అంతం కావాలంటూ రుద్రాభిషేకం నిర్వహించారు.


స్వచ్ఛందంగా సహకరించిన జనం

జగిత్యాల జిల్లాలో జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. కరోనా వైరస్‌ను అంతం చేయాలనే ఆలోచనతో ప్రధాన మంత్రి మోడీ ఇచ్చిన పిలుపు మేర కు జగిత్యాల జిల్లావ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి మున్సి పాలిటీలతో పాటు 360 గ్రామాల్లో నిశ్శబ్ధం రాజ్యమేలింది. నిత్యం జన సంద డి కనిపించే పట్టణ ప్రాంతాలన్నీ జనతా కర్ఫ్యూతో నిర్మానుష్యంగా మారా యి. పట్టణ ప్రాంతాల్లోని వ్యాపార,వాణిజ్య సంస్థలు మూసివేశారు. కిరాణం కొట్లు, టీ కొట్లు, అన్ని రకాల వ్యాపార సంస్థల యాజమానులు స్వచ్ఛం దంగా బంద్‌ పాటించారు. రెండు, మూడు రోజుల నుంచే విస్తృతంగా జనతా కర్ఫ్యూతో ప్రచారం జరుగడంతో జిల్లా ప్రజలు గృహాలకే పరిమిత మయ్యారు.


ఆదివారం కర్ఫ్యూ ఉన్న విషయం తెలియడంతో ముందస్తుగానే ప్రజలు ఏర్పాట్లు చేసుకుని కుటుంబసభ్యులతో ఇళ్లలో గడిపారు. ముంద స్తుగా జిల్లా కలెక్టర్‌ జి.రవి ఆదేశాల మేరకు అన్ని మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు బంద్‌ను పర్యవేక్షించాయి. జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ దక్షిణమూర్తి, జగిత్యాల, మెట్‌పల్లి డీఎస్పీలు వెంకటరమణ, గౌస్‌బాబా ఆధ్వర్యంలో పోలీసులు కొన్ని చెక్‌పోస్టులను ఏర్పాటు చేసుకుని బంద్‌  విజయవంతమయ్యేలా చేశారు. బంద్‌ దృష్ట్యా రోడ్డు రవాణా సంస్థ బంద్‌ ప్రకటించగా, జగిత్యాల, కోరుట్లలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.


గృహాలకే పరిమితమైన అధికారులు, ప్రజాప్రతినిధులు

జగిత్యాల జిల్లాలో ఆదివారం జనతా కర్ఫ్యూ వల్ల అధికారులు, ప్రజాప్ర తినిధులు సెల్ఫ్‌ క్వారంటైన్‌ ప్రకటించుకున్నారు. నిత్యం వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉన్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కరీంనగర్‌లోని క్యాంప్‌ ఆఫీస్‌కే పరిమితమయ్యారు. ఆయన సతీమణి స్నేహలతతో కలిసి టీవీ చూసుకుంటూ కాలక్షేపం చేశారు. సాయంత్రం 5 గంటలకు ఆయనతో పాటు ఆయన సిబ్బంది చప్పట్లు కొట్టారు.


జిల్లా కలెక్టర్‌ జి.రవి క్యాంప్‌ ఆఫీస్‌లోనే ఉంటూ రోజంతా జిల్లాలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించగా, సాయంత్రం 5 గంటలకు కుటుంబసభ్యులతో కలిసి చప్పట్లు కొట్టారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ జిల్లాలో నెలకొన్న పరిస్థితులను రోజంతా పరిశీలించగా, సాయంత్రం 5 గంటలకు క్యాంప్‌ ఆఫీస్‌ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపైకి వచ్చి సిబ్బందితో కలిసి చప్పట్లు కొట్టారు. జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ దావ వసంత కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లోనే గడుపగా, సాయంత్రం కుమారులతో కలిసి చప్పట్లు కొట్టారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు కూడా సెల్ఫ్‌ క్వారెంటైన్‌ ప్రకటించుకుని సాయంత్రం చప్పట్లు కొట్టారు.


 చప్పట్లతో మద్దతు 

జగిత్యాల జిల్లాలో జనతా కర్ఫ్యూకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ప్రజలు సాయంత్రం 5 గంటలకు చప్పట్ల మోత మోగించారు. ప్రధాన మంత్రి పిలుపు మేరకు స్వచ్ఛందంగా బంద్‌ పాటించడంతో పాటు సాయంత్రం 5 గంటలకు ఇళ్లల్లోకి బయటకు వచ్చి 2 నుంచి 5 నిమిషాల పాటు చప్పట్లు కొట్టారు. కొందరు జగిత్యాలలోని టవర్‌ సర్కిల్‌ వద్ద కొత్త బస్టాండ్‌, పాత బస్టాండ్‌తో పాటు వివిధ కాలనీల్లో అపార్ట్‌మెంట్ల వద్ద చప్పట్లతో పాటు జాతీయ జెండాను ప్రదర్శించారు. కొందరు భవంతుల పైకి ఎక్కి, స్వచ్ఛందంగా చప్పట్లు కొట్టి బంద్‌కు సంఘీభావం ప్రకటించారు. కొన్ని చోట్ల చిన్నారులు సైతం చప్పట్లు కొట్టడం దేశ ఐక్యతను చాటినట్లు అయింది.


 మెట్‌పల్లిలో అంత్యక్రియలు వాయిదా

జగిత్యాల జిల్లాలో జనతా కర్ఫ్యూను స్వచ్ఛందంగా పాటించిన ప్రజలు పలు కార్యక్రమాలను కూడా వాయిదా వేసుకున్నారు. మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్‌ గ్రామానికి చెందిన చిన్న రాజం అనారోగ్యంతో ఆదివారం మరణించగా, జనతా కర్ఫ్యూ అమలులో ఉండటంతో అంత్యక్రియలను సోమవారానికి వాయిదా వేసుకున్నారు. మల్యాల మండలంలోని కొండగట్టులో వెంకటేష్‌ అనే యువకుని వివాహం శుక్రవారం జరుగగా, ఆదివారం రిసెన్షన్‌ ఉండగా వాయిదా వేసుకున్నారు. మల్లాపూర్‌ మండలం మొగిలిపేటలో ప్ర శాంత్‌-శృతిల వివాహం జరిగింది.   


జనతా కర్ఫ్యూతో రిసెప్షన్‌ వాయిదా వేశారు. రాఘవపేటలో వనీషా పుట్టిన రోజు వేడుకలను ఆదివారం జరిపేందుకు కుటుంబసభ్యులు వారం రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేసుకోగా వాయిదా వేశారు. కొడిమ్యాలకు చెందిన ప్రశాంత్‌ రిసెప్షన్‌ వేడుకలను వాయిదా వేసుకోగా, అదే గ్రామానికి చెందిన అంజలి వివాహం ఆదివారం జరుగాల్సి ఉండగా, శనివారం రాత్రి జరిపించారు. మెట్‌పల్లికి చెందిన సాయికుమార్‌-రశ్మిత రిసెప్షన్‌ వేడుకలను రద్దు వేసుకున్నారు. మెట్‌పల్లిలో కరోనా అంతం కావాలంటూ రుద్రాభిషేకం నిర్వహించారు.

Updated Date - 2020-03-23T10:57:38+05:30 IST