స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగస్వాములు కావాలి
ABN , First Publish Date - 2020-12-02T05:08:54+05:30 IST
స్వచ్చ సర్వేక్షన్-2020లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మెరుగైన ర్యాంకును సాధించేందుకు నగరంలోని హోటల్, రెస్టారెంట్ల యజమానులు స్వచ్ఛ సర్వేక్షన్లో భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి కోరారు.

మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి
కరీంనగర్ టౌన్, డిసెంబరు 1: స్వచ్చ సర్వేక్షన్-2020లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మెరుగైన ర్యాంకును సాధించేందుకు నగరంలోని హోటల్, రెస్టారెంట్ల యజమానులు స్వచ్ఛ సర్వేక్షన్లో భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి కోరారు. మంగళవారం స్థానిక ఓ ప్రైవేట్ హోటల్లో హోటల్, బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు, నిర్వాహకులతో స్వచ్ఛ సర్వేక్షన్పై అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తడి, పొడి చెత్తతోపాటు హానికర వ్యర్థాలను వేర్వేరుగా చెత్త బుట్టలలో వేసి మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఇవ్వాలని, ప్రతి హోటల్, బార్, రెస్టారెండ్లలో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని, క్లాత్ బ్యాగ్లను వినియోగించాలని సూచించారు. హోటల్లో వెలువడే చెత్తను ఇన్స్నేటర్ ద్వారా కాల్చివేయాలని, తడిచెత్తను సేంద్రీయ ఎరువుగా మార్చేందుకు గుంతలను తవ్వుకోవాలని కోరారు. హోటల్స్లో పరిశుభ్రతను పాటించాలని, మరుగుదొడ్లు, వంటశాలలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షన్ బృందం హోటళ్లు , రెస్టారెంట్లు, బార్లను తనిఖీ చేసి పరిశుభ్రతను పరిశీలించి మార్కులు వేస్తారని, మెరుగైన ర్యాంకు సాధించేందుకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో హోటల్స్, బార్స్, రెస్టారెంట్ల యజమానులు, నిర్వాహకులు పాల్గొన్నారు.