పోలీసుశాఖను ఆదర్శంగా తీసుకుని చిట్టడవుల పెంపకం
ABN , First Publish Date - 2020-06-25T10:30:04+05:30 IST
జిల్లాలోని మున్సిపాలిటీలకు చెందిన ఖాళీ స్థలాల్లో పోలీసుశాఖను ఆదర్శంగా తీసుకుని మియావాకి పద్ధతిలో చిట్టడవుల పెంపకానికి

కలెక్టర్ కె శశాంక
కరీంనగర్ క్రైం, జూన్ 24 : జిల్లాలోని మున్సిపాలిటీలకు చెందిన ఖాళీ స్థలాల్లో పోలీసుశాఖను ఆదర్శంగా తీసుకుని మియావాకి పద్ధతిలో చిట్టడవుల పెంపకానికి శ్రీకారం చుట్టనున్నామని కలెక్టర్ కె శశాంక అన్నారు. భవిష్యత్తరాలను దృష్టిలో ఉంచుకుని కమిషనరేట్ పోలీసులు ఈ మహత్కార్యానికి ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ చిట్టడవుల పెంపకంపై అధ్యయనం చేసి ఆచరించేందుకు జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల చైర్పర్సన్లు, కమిషనర్లు బుధవారం సీపీటీసీలోని చిట్టడవుల పెంపకం ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ కె శశాంక మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పోలీసుశాఖలోని వివిధ విభాగాలకు చెందిన పోలీసుల అంకితభావం ఫలితంగా ఈ చిట్టడవులు, హరితహారంలో నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా నిలిచాయని చెప్పారు. సీపీ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ వృక్షశాస్త్రవేత్త మియావాకి, మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్కలాంలు రూపొందించిన పవర్పాయింట్ ప్రజెంటేషన్లకు ఆకర్షితమై భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన వాతావరణం అందించడం కోసం మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టామన్నారు.