ప్రజల భద్రత కోసం క్యూఆర్కోడ్ విధానం
ABN , First Publish Date - 2020-05-28T11:08:34+05:30 IST
ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికుల భద్రత కోసం ప్యాసింజర్ వెహికల్ డిజిటలైజేషన్ విధానాన్ని అమలు చేస్తున్నామని సీపీ ఒక ప్రకటనలో తెలిపారు.
పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్రెడ్డి
కరీంనగర్ క్రైం, మే 27: ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికుల భద్రత కోసం ప్యాసింజర్ వెహికల్ డిజిటలైజేషన్ విధానాన్ని అమలు చేస్తున్నామని సీపీ ఒక ప్రకటనలో తెలిపారు. క్యూఆర్కోడ్ విధానంపై అన్నివర్గాల ప్రజలకు అవగాహనకల్పించేందుకు కార్యక్రమాలను నిర్వహించాలని కమిషనర్ వీబీ కమలాసన్రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. ఆటో, క్యాబ్ లాంటి వాహనాలకు డిజిటల్ క్యూఆర్కోడ్(క్విక్ రెస్పాన్స్కోడ్) కొనసాగిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం జనవరి 31న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. కమిషనరేట్ వ్యాప్తంగా ఇప్పటివరకు 8వేలకు పైగా ప్రైవేట్ వాహనాలను రిజిస్ట్రేషన్ పూర్తిచేశామని, డిజిటిల్ బోర్డు, క్యూఆర్కోడ్లు హాక్ఐ, టీఎస్ కాప్యాప్లను అనుసంధానం చేశామ న్నారు. దీనితో ప్రయాణికులు వాహనంలో ఎక్కడ ఉన్న వారి లోకేషన్ షేర్ అవుతుందని తెలిపారు.
పోలీసులు వ్యాయామాన్ని అలవర్చుకోవాలి..
పోలీసులు రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవడం కోసం వ్యాయామాన్ని దిన చర్యలో భాగంగా అలవర్చుకోవాలని పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్రెడ్డి అన్నారు. ప్రస్తుతం భగభగమండుతున్న ఎండలు, వడగాలుల నేపథ్యంలో తొందరగా అలసిపోవడం జరుగుతున్న విషయాన్ని గుర్తించి గొడుగులు, మాస్కులు, కళ్ళద్దాలు, నీటిలో కలుపుకుని తాగేందుకు వీలుగా వివిధ రకాలకు చెందిన ఎనర్జీ డ్రింక్లను కమిషనరేట్ వ్యాప్తంగా పోలీసులకు అందజేశామని సీపీ తెలిపారు. అల్లర్లకు పాల్పడే వారిని గుర్తించి మొదట బైండోవర్ చేసి, తరుచూ అదే తరహా అల్లర్లకు పాల్పడితే వారిపై రౌడీషీట్లను తెరవాలని ఆదేశించారు.