జాతీయ లోక్ అదాలత్కు పెరుగుతున్న స్పందన
ABN , First Publish Date - 2020-12-13T05:32:24+05:30 IST
కేసుల సత్వర పరిష్కారం కోసం ఏర్పాటు చేస్తున్న లోక్ అదాలత్లకు స్పందన పెరుగుతోందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి యం.జి. ప్రియదర్శిని తెలిపారు.

జిల్లా జడ్జి ప్రియదర్శిని
కరీంనగర్ లీగల్, డిసెంబరు 12: కేసుల సత్వర పరిష్కారం కోసం ఏర్పాటు చేస్తున్న లోక్ అదాలత్లకు స్పందన పెరుగుతోందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి యంజి ప్రియదర్శిని తెలిపారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ దినం పురస్కరించుకొని జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా సదన్లో జాతీయ లోక్అదాలత్ ప్రారంభోత్సవానికి ఆమె హాజరై మాట్లాడారు. కోర్టులో కేసుల విచారణ అనంతరం దానిలో ఒక్క పార్టీవారు మాత్రమే గెలుస్తారని, రాజీ ద్వారా లోక్ అదాలత్లో పరిష్కరించుకుంటే రెండు పార్టీలవారు గెలుస్తారని తెలిపారు. రాజీద్వారా వారి కేసులు పరిష్కరించుకుంటే డబ్బు, సమయం వృథా కాకుండా ఉంటుందని తెలిపారు. ఈసారి లోక్ అదాలత్లో కక్షిదారులు వర్చువల్, ఫిజికల్గా హాజరై వరి కేసులు పరిష్కరించుకొంటున్నారని తెలిపారు. మొదటి అదనపు జిల్లా జడ్జి డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ అనేది పండుగ వాతావరణమని, రాజీ యే రాజీమార్గం అనే నినాదంతో ఈ చట్టం తెచ్చానని, దీనిలో ఇచ్చే తీర్పులు సివిల్ కోర్టు తీర్పులతో సమానమని, మైనర్ బాలురు ప్రేమ, పెళ్లి అని వారి జీవితాలు నాశనం చేసుకొంటున్నారని, వాటికి దూరంగా ఉండి భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని తెలిపారు. నాల్గవ అదనపు జిల్లా జడ్జి మాధవికృష్ణ, కరీంనగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ చంద్రమోహన్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు పీవీ రాజ్కుమార్లు మాట్లాడారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి సుజయ్ లోక్ అదాలత్లో పరిష్కరించుకున్న కేసులలో కోర్టు ఫీజు తిరిగి ఇస్తున్నట్లు తెలపారు. ఈ కార్యక్రమంలో మేజిస్ర్టేట్లు ప్రదీప్, చందన, ట్రైనీ మెజిస్ర్టేట్లు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లెంకల రాంరెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు గౌరు రాజిరెడ్డి, తుమికి పవన్ కుమార్, కక్షిదారులు, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.