దీపం..దేదీప్యం
ABN , First Publish Date - 2020-12-01T05:39:13+05:30 IST
జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు అంబరాన్నంటాయి. దీపోత్సవాలు కన్నుల పండువగా సాగాయి. కొవిడ్ను మరిచి భక్తులు వివిధ దేవాలయాల్లో శివుడిని దర్శించుకున్నారు. సోమవారంతోపాటు కార్తీక పౌర్ణమి కలిసిరావడంతో దేవాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి.
- ఊరూరా కార్తీక శోభ
- వెల్లివిరిసిన భక్తిభావం
- కిటకిటలాడిన దేవాలయాలు
- కొవిడ్ను మరిచిన భక్తులు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు అంబరాన్నంటాయి. దీపోత్సవాలు కన్నుల పండువగా సాగాయి. కొవిడ్ను మరిచి భక్తులు వివిధ దేవాలయాల్లో శివుడిని దర్శించుకున్నారు. సోమవారంతోపాటు కార్తీక పౌర్ణమి కలిసిరావడంతో దేవాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రంతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని శివాలయాల్లో పౌర్ణమి వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు. సిరిసిల్లలోని రాజరాజేశ్వరస్వామి దేవస్థానం, శివాలయాల్లో అభిషేకాలు, క్షీరాభిషేకాలు, రుద్రాభిషేకాలు చేశారు. సిరిసిల్లలోని లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవస్థానం, రాజరాజేశ్వరస్వామి దేవస్థానం, శివసాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాలు, తులసీ పూజలు, నోములను నిర్వహించుకున్నారు. రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, విశ్వనాథ దేవాలయం, శివాలయంలో మహిళలు దీపాలు వెలిగించి శివుడికి ప్రత్యేక పూజలు చేశారు.
రాజన్న సేవలో కలెక్టర్
వేములవాడ: కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామివారిని కలెక్టర్ కృష్ణభాస్కర్ సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు కలెక్టర్కు స్వామివారి ప్రసాదం అందజేసి ఆశీర్వదించారు. అదేవిధంగా సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాసరావు దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో కార్తీక దీపం వెలిగించారు.