1,2 మనవే..ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
ABN , First Publish Date - 2020-06-19T07:08:35+05:30 IST
ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు అత్యుత్తమ మార్కులను సాధించి రాష్ట్రస్థాయిలో టాపర్లుగా నిలిచారు. రాష్ట్రస్థాయిలో టాప్టెన్ మార్కులు సాధించిన
![1,2 మనవే..ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మరోసారి సత్తాచాటిన బాలికలు
ద్వితీయ సంవత్సరంలో 74 శాతం..
ప్రథమ సంవత్సరంలో 65 శాతం ఉత్తీర్ణత
టాప్ టెన్లో 50 మంది..
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు అత్యుత్తమ మార్కులను సాధించి రాష్ట్రస్థాయిలో టాపర్లుగా నిలిచారు. రాష్ట్రస్థాయిలో టాప్టెన్ మార్కులు సాధించిన వారిలో మొదటి, రెండో స్థానంలోని వారు జిల్లా విద్యార్థులే కావడం విశేషం. గత ఏడాదితో పోల్చితే ఈసారి ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఐదు శాతం ఉత్తీర్ణత పెరుగగా, ప్రథమ సంవత్సరంలో రెండు శాతం ఉత్తీర్ణత తగ్గింది. గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు మొత్తం 15,836 మంది విద్యార్థులు హాజరు కాగా 11,771 మంది ఉత్తీర్ణులయ్యారు. జనరల్ విభాగంలో 14,247 మంది పరీక్షలు రాయగా 10,813 మంది, ఒకేషనల్ విభాగంలో 1589 మంది విద్యార్థులు ఒకేషనల్ పరీక్షలు రాయగా 958 మంది ఉత్తీర్ణులయ్యారు. 74 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో జిల్లా 6వ ర్యాంకులో నిలిచింది.
ప్రథమ సంవత్సరంలో 65 శాతం ఉత్తీర్ణతతో 6వ ర్యాంకులో ఉంది. 17,558 మంది పరీక్షలు రాయగా 11,439 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో జనరల్ విభాగంలో 15,574 మందికి 10,4567 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్లో 1984 మంది పరీక్షలు రాయగా 972 మంది పాసయ్యారు. సెకండ్ ఈయర్లో 7463 మందికి 5105 మంది ఉత్తీర్ణత సాధించగా, 8773 మందికి 6666 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. సెకండర్ ఈయర్లో జనరల్, ఒకేషనల్ రెండు విభాగాల్లోనూ బాలురు 68శాతం ఉత్తీర్ణులు కాగా బాలికలు 80శాతం ఉత్తీర్ణత సాధించి పైచేయిగా నిలిచారు. ఇక ఫస్ట్ఈయర్లో 8840 మంది బాలురు పరీక్షలు రాయగా 5206 మంది, 8718 మందికి 6733 మంది ఉత్తీర్ణులయ్యారు. దీనితో 12 శాతం అత్యధికంగా బాలికలు ఉత్తీర్ణులయ్యారు.
టాప్ టెన్ ర్యాంకులు....
కరీంనగర్ అల్ఫోర్స్ జూనియర్ కళాశాలకు చెందిన జి.వైష్ణవి (ఎంపీసీలో), ర్యాంక కృషిత(బైపీసీ), ఎస్ఆర్ కళాశాలకు చెందిన ఎడ్ల స్రవంతి, చిందం లిఖిత 1000 మార్కులకుగాను 992 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంకుల్లో నిలిచారు. అల్ఫోర్స్ కళాశాలకు చెందిన బైపీసీ విద్యార్థులు చించు స్వాతి, ఎనుకొండ దీక్షిత, పి శ్రావణి, ఎస్ఆర్ కళాశాలకు చెందిన వంచ సుప్రియ 990 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో సెకండ్ ర్యాంకులో నిలిచారు. మరో 50 మంది విద్యార్థులు 988 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించారు.