‘స్మార్ట్’ పనుల్లో వేగం పెంచండి
ABN , First Publish Date - 2020-05-27T10:21:24+05:30 IST
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న స్మార్ట్ సిటీ పనులను నాణ్యత ప్రమాణాలను
నాణ్యతా ప్రమాణాలను పాటించాలి
మాస్టర్ప్లాన్ ప్రకారంగా రోడ్ల విస్తరణ చేయండి
రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆహారపౌరసరఫరాలశాఖల మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, మే 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న స్మార్ట్ సిటీ పనులను నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ వేగవంతంగా పూర్తిచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్మార్ట్సిటీ పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తున్నందున పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. లేకపోతే పనులకు ఆటంకం కలుగుతుందని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని, అధికారులు పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్ల విస్తరించాలని, రోడ్లపై ఉన్న నిర్మాణాలను నోటీసులు ఇచ్చిన తర్వాతనే తొలగించాలని సూచించారు.
అలైన్మెంట్ చేసేటప్పుడు రోడ్డు చెడిపోకుండా చూడాలన్నారు. కరీంనగర్లో 1997 సంవత్సరంలో మొదటిసారి మాస్టర్ప్లాన్ అమలు చేశారని, అప్పటి జనాభాకు అనుకూలంగా రోడ్ల విస్తరణ చేపట్టారన్నారు. ప్రస్తుతం స్మార్ట్సిటీలో రోడ్డును విస్తరిస్తున్నందన సెట్బ్యాక్ పాటించేలా చూడాలని టౌన్ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ కె శశాంక మాట్లాడుతూ రోడ్లనిర్మాణంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం లేని అక్రమ, అనధికార కట్టడాలను గుర్తించి వాటిని తొలగించాలన్నారు. 60 ఫీట్ల రోడ్లు 58 ఫీట్ల కంటే బాల్కనీ ముందుకు వచ్చినప్పడు వాటిని తొలగించాలని తెలిపారు. సైడ్ డ్రెయినేజీలను, విద్యుత్ స్తంభాల తొలగింపును తొందరగా పూర్తి చేయాలన్నారు.
మేయర్ సునీల్రావు మాట్లాడుతూ నగరంలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుకుండా పనులు చేపట్టాలని కాంట్రాక్టర్కు సూచించారు. నూతనంగా వేసే రోడ్లలో కరెంట్ స్తంభాలతో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలన్నారు. వారానికోసారి ఏజెన్సీ, కాంట్రాక్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి స్మార్ట్సిటీ పనుల పురోగతిని తెలియజేయాలన్నారు. ఏజెన్సీలకు నిర్ణయించిన గడువులోగా స్మార్ట్సిటీ పనులు పూర్తి చేయకుంటే నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. నగరసుందరీకరణ పనులను కూడా త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, మున్సిపల్ ఎస్ఈ భధ్రయ్య, టౌన్ ప్లానింగ్ అధికారులు, స్మార్ట్సిటీ కన్సల్టెంట్స్, కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.