టిక్కెట్లలో తప్పుడు సీరియల్‌ నంబర్లు

ABN , First Publish Date - 2020-12-15T06:07:03+05:30 IST

లడ్డూ ప్రసాదం టిక్కెట్లలో తప్పుడు సీరియల్‌ నంబర్లు ఉన్న ఘటన వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. భక్తులకు విక్రయించే లడ్డూ ప్రసాదం టిక్కెట్ల కోసం కొంతకాలంగా కంప్యూటర్‌ రశీదరులను కాకుండా పాత పద్ధతిలో ముద్రించిన టిక్కెట్లను ఉపయోగిస్తున్నారు.

టిక్కెట్లలో తప్పుడు సీరియల్‌ నంబర్లు
తప్పుడు అంకెలతో ముద్రితమైన లడ్డూ టిక్కెట్లు

- ముద్రణాలోపంతో సిబ్బందిలో ఆందోళన

- పట్టించుకోని ఆలయ అధికారులు

వేములవాడ, డిసెంబరు 14 : లడ్డూ ప్రసాదం టిక్కెట్లలో తప్పుడు సీరియల్‌ నంబర్లు ఉన్న ఘటన వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. భక్తులకు విక్రయించే లడ్డూ ప్రసాదం టిక్కెట్ల కోసం కొంతకాలంగా కంప్యూటర్‌ రశీదరులను కాకుండా పాత పద్ధతిలో ముద్రించిన టిక్కెట్లను ఉపయోగిస్తున్నారు. సోమవారం ఆలయ ప్రసాదాల విక్రయశాల బుకింగ్‌ కౌంటర్‌లోని ఓ ఉద్యోగి టిక్కెట్లలో సీరియల్‌ నంబరు తప్పు ముద్రించి ఉన్నట్లు గుర్తించి అవాక్కయ్యారు. 406010 తరువాత 406011 ఉండాల్సి ఉండగా, 406021 నుంచి  సీరియల్‌ నంబరు మొదలైంది. మధ్యలో పది అంకెలు లేకపోవడంతో పది టిక్కెట్లు గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడింది.  అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో తనకు నష్టం తప్పిందని, చూడకుండా టిక్కెట్లు జారీ చేస్తే మధ్యలో మిస్సయిన పది టిక్కెట్లకు రూ.20 చొప్పున డబ్బు జమ చేయాల్సి వచ్చేదని వాపోయాడు. 


పాత పద్ధతిలోనే టిక్కెట్ల విక్రయం 

కరోనా ఆంక్షలకు ముందు ఆలయంలో టిక్కెట్ల జారీకి ఈ- టికెట్‌ విఽధానాన్ని అమలు చేశారు. లాక్‌డౌన్‌ అనంతరం మళ్లీ పాత విధానంలో ముద్రిత టిక్కెట్లను విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో తరచూ సంబంధిత సిబ్బందికి నగదు తక్కువగా వస్తున్నదని, ఇందుకు టిక్కెట్లలో సీరియల్‌ నంబర్లను తప్పుగా ముద్రించడమే కారణమని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రసాదాల విక్రయానికి సంబంధించిన టికెట్‌ బుక్కులో ఒక్కో పేజీకి నాలుగు టిక్కెట్ల చొప్పున 250 పేజీలు ఉంటాయి. ఇటీవల ఓ ఉద్యోగి నగదు చెల్లించే సమయంలో 36 వేల రూపాయలు లోటు వచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. మరోవైపు కొన్ని టికెట్‌ బుక్కులలో కొన్ని నంబర్లతో కూడిన పేజీలు రెండుమూడుసార్లు ఉన్న ఘటనలు కూడా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. జైళ్ల శాఖ ముద్రిస్తున్న ప్రసాదం, కళ్యాణం, ఇతర ఆర్జిత సేవల టిక్కెట్ల బుక్కులను పూర్తిగా పరిశీలించి కౌంటర్‌లోని సిబ్బందికి అందజేయాల్సి ఉండగా, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పేజీలు అదనంగా వచ్చిన సందర్భాలయాలో వేలాది రూపాయల ఆలయ ఖజానాకు నష్టం వచ్చి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  తప్పుడు సీరియల్‌ నంబర్ల వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించామని ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ వెల్లడించారు.  

Updated Date - 2020-12-15T06:07:03+05:30 IST