దుబ్బాకలో మొరాయించిన ఈవీఎంలు.. దొంగ ఓటు కలకలం

ABN , First Publish Date - 2020-11-03T21:31:59+05:30 IST

తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్‌లో ఈవీఎంలు మొరాయించాయి. దుబ్బాకలోని దుంపలపల్లి, రామక్కపేట, ఎనగుర్తి గ్రామాల పోలింగ్ బూత్‌లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు చాలాసేపు ఎదురు చూసే పరిస్థితి నెలకొంది.

దుబ్బాకలో మొరాయించిన ఈవీఎంలు.. దొంగ ఓటు కలకలం

సిద్దిపేట: తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్‌లో ఈవీఎంలు మొరాయించాయి. దుబ్బాకలోని దుంపలపల్లి, రామక్కపేట, ఎనగుర్తి గ్రామాల పోలింగ్ బూత్‌లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు చాలాసేపు ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. అయినా ఈవీఎం పనిచేయకపోవడంతో చేసేదిలేక ఓటర్లు ఓటు వేయకుండానే వెనుదిరిగి వెళ్లారు. రాయపోల్ మండలం అరెపల్లి  గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో గంటన్నర పాటు పోలింగ్ నిలిచిపోయింది. అలాగే తొగుట మండలం వెంకటరావుపేటలోని 142/ఏ పోలింగ్ బూత్‌లో కూడా ఈవీఎం మెషిన్లు మొరాయించాయి. అక్కడ అర్ధగంటపైగా ఓటర్లు ఎండలో ఇబ్బంది పడ్డారు. ఇక అక్కడక్కడ చిన్న చిన్న ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.


ఫొటోల కోసం క్లిక్ చేయండి


రాయపోల్ మండలం కొత్తపల్లిలో ఒక వర్గానికి చెందిన కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తుంటే పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. ఇక మెదక్ జిల్లా చేగుంటలో దొంగ ఓటు కలకలం రేపింది. రాధాకృష్ణ శర్మ అనే పౌరుడి ఓటును గుర్తు తెలియని వ్యక్తి వేసి వెళ్లిపోయాడు. తన ఓటును ఎవరో దొంగ ఓటు వేసి వెళ్లడంతో ఆయన టెండర్ ఓటు సదుపాయాన్ని వినియోగించుకున్నారు. దొంగ ఓటు వేసిన వ్యక్తి మాస్క్ ధరించి ఉడడంతో పోలింగ్ ఏజెంట్లు గుర్తు పట్టలేదు. మొత్తంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో మధ్యామ్నం 1 గంట వరకు 60 శాతం నమోదైన పోలింగ్ మధ్యాహ్నం 3 గంటలకు 75 శాతానికి పెరిగింది. ఇక పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ హనుమంతరావు, ఎన్నికల ముఖ్య అధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు.

Updated Date - 2020-11-03T21:31:59+05:30 IST