బద్దిపోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
ABN , First Publish Date - 2020-12-01T05:30:00+05:30 IST
వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలోని బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం మంగళవారం భక్తులు పోటెత్తడంతో జాతరను మరిపించింది.
బోనాలు సమర్పించి మొక్కులు చెల్లింపు
వేములవాడ, డిసెంబరు 1: వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలోని బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం మంగళవారం భక్తులు పోటెత్తడంతో జాతరను మరిపించింది. కార్తీకమాసం మూడో సోమవారం సందర్భంగా శ్రీరాజరాజేశ్వరస్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఆనవాయితీ ప్రకారం మంగళవారం బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించుకుని తరించారు. ఈ సందర్భంగా వారు తెల్లవారుజామునే భక్తి శ్రద్ధలతో నైవేద్యం వండి బోనం రూపొందించి ఊరేగింపుగా బద్దిపోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. వేలాది మంది భక్తులు బోనం మొక్కు చెల్లింపు కోసం తరలిరావడంతో బద్దిపోచమ్మ వీధి కిక్కిరిసిపోయింది. బోనం మొక్కు చెల్లింపు కోసం భక్తులు సుమారు రెండు నుంచి మూడు గంటలు వేచిచూశారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.